IND vs ENG: పూర్తిగా స్పిన్నర్లతోనే? వైజాగ్ టెస్టుకు ఇంగ్లండ్ సరికొత్త వ్యూహం
ABN , Publish Date - Feb 01 , 2024 | 04:17 AM
భారత్తో జరిగే రెండో టెస్ట్కు ఇంగ్లండ్ తన వ్యూహాన్ని మార్చబోతోందట! విశాఖపట్నంలో జరిగే ఈ టెస్ట్కు మొత్తం స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని భావిస్తోందట!!
![IND vs ENG: పూర్తిగా స్పిన్నర్లతోనే? వైజాగ్ టెస్టుకు ఇంగ్లండ్ సరికొత్త వ్యూహం](https://media.andhrajyothy.com/media/2023/20231205/fkdlbn_d845890037.jpg)
విశాఖ టెస్ట్కు ఇంగ్లండ్ వ్యూహం
విశాఖపట్నం: భారత్తో జరిగే రెండో టెస్ట్కు ఇంగ్లండ్ తన వ్యూహాన్ని మార్చబోతోందట! విశాఖపట్నంలో జరిగే ఈ టెస్ట్కు మొత్తం స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని భావిస్తోందట!! హైదరాబాద్లో జరిగిన మొదటి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో వెనుకంజలో నిలిచి కూడా..పర్యాటక జట్టు అద్భుత విజయం దక్కించుకుంది. ఇందుకు ప్రధాన కారణం అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్ట్లీ. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో అతడు కీలక భూమిక పోషించాడు. రెండో టెస్ట్ జరిగే విశాఖ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే భారత బ్యాటర్లు స్లో బౌలర్ల బౌలింగ్లోనూ తడబాటుకు లోనవుతున్న తీరును చూసిన ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం తమ సంప్రదాయానికి భిన్నంగా..పూర్తిగా స్పిన్నర్లతోనే ఆడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది. ఇంగ్లండ్ కనుక ఇదే వ్యూహాన్ని అమలు చేస్తే..20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ విశాఖ టెస్ట్లో అరంగేట్రం చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ‘మా స్పిన్నర్లందరినీ ఆడించేందుకు భయపడబోం’ అని ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ అనడం రెండో టెస్ట్కు ఆ జట్టు వ్యూహాన్ని పరోక్షంగా తెలియజేస్తోంది. హార్ట్లీకి, బషీర్ తోడైతే మాత్రం భారత్కు కష్టాలు తప్పవు.
వామ్మో..భారత వికెట్లా..: ఫోక్స్
భారత పిచ్లపై వికెట్ కీపింగ్ ఎంతో కష్టమని..ఇంగ్లండ్ కీపర్ బెన్ ఫోక్స్ అభిప్రాయపడ్డాడు. ‘భారత వికెట్లపై బంతులు అనూహ్యంగా బౌన్స్ అవుతాయి. అందుకే స్పిన్నర్ల బౌలింగ్లోనూ వికెట్లకు దూరంగా ఉండి కీపింగ్ చేయాలి’ అని చెప్పుకొచ్చాడు.
అది సహజంగా వచ్చిందే..
బజ్బాల్ వ్యూహాన్ని తమ జట్టు బ్యాటర్లంతా పూర్తిగా వంటబట్టించుకున్నారని ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ తెలిపాడు. అలా ఆడడం ప్రారంభించాక వారంతా బ్యాటింగ్లో ఎంతో మెరుగయ్యారన్నాడు. న్యూజిలాండ్కు చెందిన బ్రెండన్ మెకల్లమ్ తానాడే రోజుల్లో దూకుడైన బ్యాటింగ్కు మారుపేరుగా నిలిచాడు. ఇంగ్లండ్ టెస్ట్ కోచ్గా వచ్చాక సుదీర్ఘ ఫార్మాట్లోనూ దూకుడుగా ఆడే ‘బజ్బాల్’ విధానాన్ని..ఆ జట్టుకు అలవాటు చేశాడు. బజ్బాల్ వ్యూహాన్ని అనుసరించడం మొదలుపెట్టాక ఇంగ్లండ్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ కూడా ఓడిపోకపోవడం విశేషం. ‘ఇంగ్లండ్ దేశవాళీలో చాలా జట్లు దూకుడుగా ఆడతాయి. అంటే..బజ్బాల్ మాకు సహజంగా వచ్చిందే’ అని క్రాలీ వివరించాడు.
గిల్, శ్రేయా్సపై ఆందోళన లేదు..
శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వైఫల్యాలపై ఆందోళన చెందడంలేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. ఇక..ఇంగ్లండ్ దూకుడుకు విశాఖ టెస్ట్లో తెలివిగా చెక్ పెట్టాలని జట్టుకు సూచించాడు. హైదరాబాద్ టెస్ట్లో భారత్ 190 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకున్నా.. 28 రన్స్తో మ్యాచ్ ఓడిన సంగతి తెలిసిందే. ‘జట్టులోని యువ బ్యాటర్లకు ఎక్కువగా టెస్ట్లు ఆడిన అనుభవం లేదు. అందువల్ల వారి బ్యాటింగ్ ఫామ్పై ఆందోళన చెందడంలేదు. గిల్, శ్రేయాస్, జైస్వాల్ త్వరలో భారీ స్కోర్లు చేస్తారు’ అని రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.