Share News

T20 World Cup : రాహుల్‌, శ్రేయాస్‌లపై వేటు చాహల్‌, దూబేలకు చోటు

ABN , Publish Date - May 01 , 2024 | 05:13 AM

ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌క్‌పలో తలపడే భారత జట్టును జాతీయ సెలెక్టర్లు మంగళవారం ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ బృందానికి ఊహించినట్టుగానే రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే హార్దిక్‌ పాండ్యా ఎంపికపై కొంత సందేహాలు వ్యక్తమైనా.. తను బెర్త్‌

T20 World Cup : రాహుల్‌, శ్రేయాస్‌లపై వేటు చాహల్‌, దూబేలకు చోటు

వికెట్‌ కీపర్లుగా పంత్‌, శాంసన్‌

హార్దిక్‌కు వైస్‌కెప్టెన్సీ

టీ20 వరల్డ్‌కప్‌నకు భారత జట్టు

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌క్‌పలో తలపడే భారత జట్టును జాతీయ సెలెక్టర్లు మంగళవారం ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ బృందానికి ఊహించినట్టుగానే రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే హార్దిక్‌ పాండ్యా ఎంపికపై కొంత సందేహాలు వ్యక్తమైనా.. తను బెర్త్‌ దక్కించుకోవడంతో పాటు జట్టు వైస్‌ కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు. 2022 టీ20 వరల్డ్‌కప్‌ సెమీ్‌సలో ఓడాక భారత జట్టులో మార్పుల కారణంగా రోహిత్‌, విరాట్‌ లేకుండానే ముందుకెళ్లారు. కానీ తిరిగి రోహిత్‌తో పాటు విరాట్‌ కోహ్లీ సైతం ఈ మెగా టోర్నీలో ఆడబోతుండడం గమనార్హం. ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్‌, మిడిలార్డర్‌లో విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా రానున్నారు. ఇక జూన్‌ ఒకటి నుంచి 29 వరకు వెస్టిండీస్‌, యూఎ్‌సఏలో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు విడతలవారీగా అమెరికా వెళ్లనున్నారు. కోచ్‌ ద్రవిడ్‌తో కలిసి తొలి బ్యాచ్‌ మే 21న బయలుదేరుతుంది.


రాహుల్‌కు నిరాశే..: జట్టులో స్టార్‌ ఆటగాడిగా కొనసాగుతున్న కేఎల్‌ రాహుల్‌పై ఆశ్చర్యకరంగా సెలెక్టర్లు వేటు వేశారు. ఐపీఎల్‌లో నిలకడగానే రాణిస్తున్నప్పటికీ అతడికి స్థానం దక్కలేదు అలాగే మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ను సైతం విస్మరించారు. ఇక ఫినిషర్‌ రింకూ సింగ్‌, ఓపెనర్‌ గిల్‌ రిజర్వ్‌ ప్లేయర్లుగా ఉంటారు. ఇప్పటికే టీ20ల్లో భారత్‌ తరఫున ఆడిన తిలక్‌ వర్మ, ముకేశ్‌ కుమార్‌లకు నిరాశే ఎదురైంది. యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ను సైతం సెలెక్టర్లు పట్టించుకోలేదు.

రిషభ్‌.. 17 నెలల తర్వాత

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులో ఆడబోతున్నాడు. 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురైన అతను తాజా ఐపీఎల్‌లో మెరుగ్గానే రాణిస్తున్నాడు. దీంతో వికెట్‌ కీపర్‌గా అతడితో పాటు సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు.ఇక, శాంసన్‌కిది తొలి వరల్డ్‌కప్‌. 2015లోనే జట్టులోకి వచ్చినా ఇప్పటికి 25 మ్యాచ్‌లే ఆడాడు. అలాగే స్పిన్నర్‌ చాహల్‌పై తిరిగి సెలెక్టర్లు నమ్మకముంచారు. గతేడాది ఆగస్టులో తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడిన చాహల్‌ తాజా ఐపీఎల్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. జడేజా, అక్షర్‌, కుల్దీప్‌ ఇతర స్పిన్నర్లుగా ఉన్నారు. అలాగే సీఎ్‌సకే మిడిలార్డర్‌ బ్యాటర్‌ శివమ్‌ దూబేను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగే దూబే మెగా టోర్నీలో ఉపయోగపడగలడని సెలెక్టర్లు భావించడంతో రింకూకు బెర్త్‌ దక్కలేదు. పేస్‌ బాధ్యతలను బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌ తీసుకోనున్నారు.


ఇదే మన సైన్యం

బ్యాటర్లు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌.

ఆల్‌రౌండర్లు: హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌.

వికెట్‌కీపర్లు: రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌

బౌలర్లు: అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్ర్పీత్‌ బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌.

రిజర్వ్‌ ఆటగాళ్లు: శుభ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అవేశ్‌ ఖాన్‌.

భారత జట్టు గ్రూపు దశ మ్యాచ్‌లివే

ఎప్పుడు ప్రత్యర్థి వేదిక సమయం

జూన్‌ 5 ఐర్లాండ్‌ న్యూయార్క్‌ రా. 7.30 గం.

జూన్‌ 9 పాకిస్తాన్‌ న్యూయార్క్‌ రా.8 గం.

జూన్‌ 12 అమెరికా న్యూయార్క్‌ రా.8 గం.

జూన్‌ 15 కెనడా లాడర్‌హిల్‌ రా.8 గం.

Updated Date - May 01 , 2024 | 05:13 AM