హైబ్రిడ్ పిచ్లు వచ్చేశాయి
ABN , Publish Date - May 07 , 2024 | 02:20 AM
ఐపీఎల్లో పూర్తిగా బ్యాటర్లే ఆధిపత్యం చెలాయిస్తుండడంతో..బౌలర్లకు ఏమా త్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. దాంతో మాజీలు, క్రికెట్ విశ్లేషకులనుంచి...
బౌలర్లకు ఉపశమనం
న్యూఢిల్లీ: ఐపీఎల్లో పూర్తిగా బ్యాటర్లే ఆధిపత్యం చెలాయిస్తుండడంతో..బౌలర్లకు ఏమా త్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. దాంతో మాజీలు, క్రికెట్ విశ్లేషకులనుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మ్యాచ్లలో బౌలర్లు, బ్యాటర్లకు నడుమ సమతూకం సాధించేందుకు బీసీసీఐ హైబ్రిడ్ పిచ్లవైపు మొగ్గుచూపింది. ధర్మశాలలో వీటిని ఏర్పాటు చేసింది. ఈసారి ఐపీఎల్లో రెండు మ్యాచ్ల్లో దీనిని ఉపయోగించాలని నిర్ణయించింది. చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ద్వారా దేశంలో మొదటిసారి హైబ్రిడ్ వికెట్ను ఆవిష్కరించారు. 9న జరిగే రెండో మ్యాచ్లో బెంగళూరుతో పంజాబ్ ఈ హైబ్రిడ్ పిచ్పైనే తలపడనుంది. సహజ సిద్ధమైన పచ్చిక, సింథటిక్ ఫైబర్ మిశ్రమాలతో తయారు చేసిన వికెట్నే హైబ్రిడ్ పిచ్ అంటారు. చాలాసేపు ఈ పిచ్ తాజాగా ఉంటుంది. బౌలర్లు ఎక్కువ బౌన్స్ రాబట్టగలుగుతారు. క్రికెట్ పిచ్ల సహజ లక్షణాలను పరిరక్షించే క్రమంలో ఈ వికెట్లలో ఐదు శాతం మాత్రమే ఫైబర్ వినియోగిస్తున్నారు.