Share News

లెక్క సరిచేశారు..

ABN , Publish Date - Jul 10 , 2024 | 02:47 AM

సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అటు బంతితో.. ఇటు బ్యాటుతో కదం తొక్కింది. తద్వారా ఇప్పటికే వన్డే, టెస్టు సిరీ్‌సలను దక్కించుకున్న హర్మన్‌ సేన మూడు టీ20ల సిరీ్‌సను...

లెక్క సరిచేశారు..

చెలరేగిన భారత్‌

సిరీస్‌ 1-1తో సమం

దక్షిణాఫ్రికా చిత్తు

చెన్నై: సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అటు బంతితో.. ఇటు బ్యాటుతో కదం తొక్కింది. తద్వారా ఇప్పటికే వన్డే, టెస్టు సిరీ్‌సలను దక్కించుకున్న హర్మన్‌ సేన మూడు టీ20ల సిరీ్‌సను సైతం 1-1తో సమం చేయగలిగింది. బలహీనంగా కనిపించిన బౌలింగ్‌ దళం మూడో టీ20లో జూలు విదిల్చింది. పేసర్‌ పూజా వస్త్రాకర్‌ (4/13) తన అద్భుత ఫామ్‌ను కొనసాగించగా.. స్పిన్నర్‌ రాధా యాదవ్‌ (3-1-6-3) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వణికించింది. దీంతో సఫారీలు కనీసం వంద పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డారు. అటు స్వల్ప ఛేదనలో భారత్‌ పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండో మ్యాచ్‌ వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ బ్రిట్స్‌ (20), బోష్‌ (17) మాత్రమే ఆకట్టుకున్నారు. పూజా, రాధా మిడిలార్డర్‌, టెయిలెండర్ల పనిబట్టడంతో 23 పరుగుల వ్యవధిలోనే ప్రత్యర్థి చివరి ఏడు వికెట్లు నేలకూలడం గమనార్హం.


ఓపెనర్లే..: స్వల్ప ఛేదనను భారత్‌ కేవలం 10.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 88 పరుగులతో ముగించింది. ఓపెనర్లు మంధాన (54 నాటౌట్‌), షఫాలీ (27 నాటౌట్‌) స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించారు. మంధాన ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ (అన్ని ఫార్మాట్లు)లో 7500 పరుగులు పూర్తిచేసింది. ఇక ఈ గెలుపుతో భారత జట్టు టీ20ల్లో 100 విజయాలను నమోదు చేసుకుంది. టీమిండియా మొత్తం 187 మ్యాచ్‌లాడింది.

దక్షిణాఫ్రికా: 17.1 ఓవర్లలో 84 ఆలౌట్‌. (బ్రిట్స్‌ 20, బోష్‌ 17; రాధా యాదవ్‌ 3/6, వస్త్రాకర్‌ 4/13)

భారత్‌: 10.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 88 (మంధాన 54 నాటౌట్‌, షఫాలీ 27 నాటౌట్‌)

Updated Date - Jul 10 , 2024 | 02:47 AM