Share News

బుమ్రా లేడు.. ఎలా ఇప్పుడు?

ABN , Publish Date - Feb 22 , 2024 | 06:05 AM

ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో నెగ్గిన భారత్‌.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. ఇదే జోరులో శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే నాలుగో టెస్టులో గెలిచి...

బుమ్రా లేడు.. ఎలా ఇప్పుడు?

రాంచీ: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో నెగ్గిన భారత్‌.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. ఇదే జోరులో శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే నాలుగో టెస్టులో గెలిచి.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ పట్టేయాలనే పట్టుదలతో ఉంది. కానీ, వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కీలకమైన పేసర్‌ బుమ్రాకు నాలుగో మ్యాచ్‌లో విశ్రాంతినివ్వడంతో భారత తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత మూడు టెస్టులను పరిశీలిస్తే స్పిన్నర్ల కంటే బుమ్రానే తన రివర్స్‌ స్వింగ్‌తో ఇంగ్లండ్‌ పనిబట్టాడు. రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఇంతటి ఫామ్‌లో ఉన్న బుమ్రాకు తక్షణం బ్రేక్‌ ఇవ్వాల్సిన పరిస్థితులైతే లేవు. కానీ, అతడి వెన్నెముక సమస్యతోపాటు రాబోయే ఐపీఎల్‌ టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలను దృష్టిలో ఉంచుకొని.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాల్సిన పరిస్థితి. మరి అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరనేది ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌ ముందున్న పెద్ద ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో రాంచీ పిచ్‌ ఎలా ఉంటుందనే దానిపైనే భారత తుది జట్టు కూర్పు ఆధారపడి ఉంది. గత మూడు టెస్టుల కోసం ఫ్లాట్‌ వికెట్లనే మేనేజ్‌మెంట్‌ ఎంపిక చేసింది. దీంతో భారత స్పిన్నర్లకు ఆశించినంత మద్దతు లభించకపోవడంతో.. పేసర్లు ఆ భారాన్ని భుజానకెత్తుకున్నారు. కానీ, ఇప్పుడు బుమ్రా గైర్హాజరీలో భారత పేస్‌ బౌలింగ్‌ కొంత బలహీనంగా కనిపిస్తోంది.

ఆకాష్‌ అరంగేట్రం?

రాంచీ వికెట్‌ కూడా నల్లమట్టితో తయారు చేసిందే. దీంతో హైదరాబాద్‌, వైజాగ్‌, రాజ్‌కోట్‌ తరహాలోనే ఈ పిచ్‌ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ భారత జట్టు స్పిన్‌ వికెట్‌ కావాలని కోరితే.. గ్రౌండ్‌ సిబ్బంది నిర్దేశిత ప్రాంతాల్లో నీటిని చల్లడమో లేదా పూర్తిగా ఆపేయడమో జరుగుతుంది. కాగా, మరో పేసర్‌ కావాలనుకొంటే సిరాజ్‌తో కొత్త బంతిని పంచుకొనేందుకు ముకేష్‌ కుమార్‌ లేదా ఆకా్‌షదీ్‌పలో ఒకరికి తుది జట్టులో స్థానం లభించొచ్చు. అయితే, వైజాగ్‌ టెస్టులో ముకేష్‌ ధారాళంగా పరుగులివ్వగా.. భారత్‌-ఎ తరఫున ఆకాష్‌ 10 వికెట్లతో ఆకట్టుకొన్నాడు. కానీ, బజ్‌బాల్‌ గేమ్‌తో ఇంగ్లండ్‌ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆకా్‌షతో అరంగేట్రం చేయించడం కొంత రిస్కే అయినా.. సెలెక్టర్లు మాత్రం అతడిని ఆడించాలనుకొంటున్నారని సమాచారం. అయితే, సిరీ్‌సలో ఆఖరిదైన ఐదో టెస్టు ధర్మశాలలో జరగనుంది. అక్కడి చల్లటి వాతావరణ పరిస్థితులు ఇంగ్లండ్‌కు ఒకింత అనుకూలం. దీంతో ఇక్కడే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకొంటున్న భారత్‌.. తమ ప్రధాన బలమైన స్పిన్‌ను దృష్టిలో ఉంచుకొని టర్నింగ్‌ వికెట్‌వైపే మొగ్గుచూపుతుందని మాజీ ఆటగాళ్ల విశ్లేషణ. ఇదే జరిగితే బుమ్రా స్థానంలో బ్యాటింగ్‌ కూడా చేయగల స్పిన్‌ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌ లేదా అక్షర్‌ పటేల్‌లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కొచ్చు.

Updated Date - Feb 22 , 2024 | 06:05 AM