బాదేసిన నవ్గిరె
ABN , Publish Date - Feb 29 , 2024 | 04:33 AM
కిరణ్ నవ్గిరె (31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 57) సుడిగాలి ఇన్నింగ్స్తో.. డబ్ల్యూపీఎల్లో యూపీ వారియర్స్ గెలుపు ఖాతా తెరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్లో యూపీ 7 వికెట్ల తేడాతో...
![బాదేసిన నవ్గిరె](https://media.andhrajyothy.com/media/2024/20240227/1_Sports_b9d8b149af.jpg)
డబ్ల్యూపీఎల్లో నేడు
బెంగళూరు X ఢిల్లీ రాత్రి 7.30 గం. నుంచి
7 వికెట్లతో యూపీ గెలుపు
ముంబైకి తొలి ఓటమి
బెంగళూరు: కిరణ్ నవ్గిరె (31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 57) సుడిగాలి ఇన్నింగ్స్తో.. డబ్ల్యూపీఎల్లో యూపీ వారియర్స్ గెలుపు ఖాతా తెరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్లో యూపీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. అంజలి, హారిస్, దీప్తి తలో వికెట్ పడగొట్టారు. ఫిట్నెస్ లేమితో హర్మన్ప్రీత్ ఈ మ్యాచ్కు దూరం కాగా.. సివర్ బ్రంట్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించింది. యాస్తిక భాటియా (26) కలసి తొలి వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హేలీ మాథ్యూస్ (55).. బ్రంట్తో కలసి రెండో వికెట్కు 42 పరుగులు జోడించింది. డెత్ ఓవర్లలో అమేలియా కెర్ (23), పూజ (18), ఇస్సీ వోంగ్ (15 నాటౌట్) వేగంగా ఆడడంతో.. టీమ్ స్కోరు 160 మార్క్ దాటింది.
పరుగుల వరద..
ఛేదనలో యూపీ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. వారియర్స్కు ఓపెనర్లు హేలీ (33), కిరణ్ తొలి వికెట్కు 56 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యంతో ధనాధన్ ఆరంభాన్నిచ్చారు. వ్రింద గాయపడడంతో ముందుగా వచ్చిన కిరణ్ ఎడాపెడా షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. వోంగ్ వేసిన మూడో ఓవర్లో కిరణ్ 4 ఫోర్లతో బ్యాట్ ఝుళిపించగా.. హేలీ కూడా ఆ తర్వాతి ఓవర్లో మరో రెండు బౌండ్రీలు బాదింది. దీంతో పవర్ప్లే ముగిసే సరికి యూపీ 61/0తో బలమైన స్థితిలో నిలిచింది. అయితే, 10వ ఓవర్లో కెర్ బౌలింగ్లో కిరణ్ అవుట్ కావడంతో.. యూపీ బ్యాటింగ్ కుదుపులకు గురైంది. ఆ తర్వాతి ఓవర్లో తహిల మెక్గ్రాత్ (1), హీలీని వోంగ్ అవుట్ చేయడంతో.. వారియర్స్ నాలుగు పరుగుల తేడాతో 3 టాపార్డర్ వికెట్లు చేజార్చుకొంది. కానీ, గ్రేస్ హారిస్ (38 నాటౌట్), దీప్తి (27 నాటౌట్) నాలుగో వికెట్కు అజేయంగా 65 పరుగులు జోడించి.. జట్టును గెలిపించారు. నవ్గిరెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.