Share News

10 గంటలు 4.6 కిలోలు

ABN , Publish Date - Aug 11 , 2024 | 02:17 AM

వలం 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో వినేశ్‌ ఫొగట్‌ పతకం కోల్పోయింది. దాంతో ఆమెతోపాటు యావత్‌ దేశం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయింది. ఈనేపథ్యంలో మరో భారత రెజ్లర్‌కు అలాంటి దుస్థితి ఎదురుకాకుండా...

10 గంటలు 4.6 కిలోలు

‘ఆపరేషన్‌ వెయిట్‌ లాస్‌’

పతక పోరుకు ముందు బరువు తగ్గిన అమన్‌

పారిస్‌: కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో వినేశ్‌ ఫొగట్‌ పతకం కోల్పోయింది. దాంతో ఆమెతోపాటు యావత్‌ దేశం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయింది. ఈనేపథ్యంలో మరో భారత రెజ్లర్‌కు అలాంటి దుస్థితి ఎదురుకాకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఈక్రమంలో అమన్‌ సెహ్రావత్‌ విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించింది. పురుషుల 57 కిలోల విభాగంలో రీ హిగుచీ (జపాన్‌)తో సెమీఫైనల్లో అమన్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఈ బౌట్‌ అనంతరం సాయంత్రం 6.30 సమయానికి సెహ్రావత్‌ 61 కిలోల 5 గ్రాముల బరువున్నాడు. దాంతో శుక్రవారం జరిగే కాంస్య పతక పోరు సమయానికి.. అమన్‌ 10 గంటల్లో 4 కిలోల 5 గ్రాముల బరువు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే..ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కోచ్‌లు జగ్‌మందర్‌ సింగ్‌, వీరేందర్‌ దహియా ‘ఆపరేషన్‌ వెయిట్‌ లాస్‌’ మిషన్‌ చేపట్టారు.


అది ఫలించి రెండోరోజు బరువు తూచే సమయానికి సెహ్రావత్‌ ఏకంగా 4.6 కిలోలు తగ్గి 56.9 కిలోలకు చేరడంతో మొత్తం భారత బృందం ఊపిరి పీల్చుకుంది. ఇక..బరువు తగ్గేందుకు అమన్‌ ఎలా శ్రమించాడంటే.. కోచ్‌ల సూచన మేరకు తొలుత గంటన్నరపాటు మ్యాట్‌పై కసరత్తులు చేశాడు. ప్రత్యర్థితో తలపడేటప్పుడు తీసుకొనే పొజిషన్లను ఇందులో ప్రాక్టీస్‌ చేశాడు. తర్వాత గంటపాటు వేడినీటితో స్నానం చేశాడు. అనంతరం జిమ్‌లో 60 నిమిషాలు నిరంతరాయంగా ట్రెడ్‌మిల్‌ చేశాడు. ఆపై 30 నిమిషాలు అమన్‌కు కోచ్‌లు విశ్రాంతి ఇచ్చారు. తర్వాత..సెషన్‌కు ఐదు నిమిషాల చొప్పున ఐదు సెషన్లపాటు ఆవిరి స్నానం చేయించారు. చివరి ఆవిరి సెషన్‌ తర్వాత అమన్‌ బరువు తూస్తే 900 గ్రాములు ఎక్కువగా ఉన్నాడు. దాంతో అతడికి మసాజ్‌ చేయడంతోపాటు తేలికపాటి జాగింగ్‌ చేయించారు. అనంతరం సెషన్‌కు 15 నిమిషాల చొప్పున ఐదు సెషన్లు రన్నింగ్‌ చేయించారు. ఉదయం 4.30కల్లా సెహ్రావత్‌ బరువు 56.9 కిలోలకు దిగొచ్చింది. అంటే నిర్దేశిత 57 కిలోలకంటే 100 గ్రాములు తక్కువన్నమాట. అప్పటికి కానీ భారత బృందం స్థిమితపడలేదు. ఇన్ని కసరత్తుల నడుమ సెహ్రావత్‌కు గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి ఇచ్చారు. అలాగే కొద్దిగా కాఫీ తాగించారు. గురువారం రాత్రంతా అతడు నిద్రపోలేదు. ‘అతడి బరువును ప్రతి గంటకూ పరిశీలించాం. ఆ రాత్రేకాదు శుక్రవారం ఉదయం కూడా అమన్‌ నిద్రపోలేదు’ అని కోచ్‌ దహియా వెల్లడించాడు. ‘బరువు తగ్గించడం సాధారణంగా జరిగే ప్రక్రియ. మాకిది అలవాటే. కానీ వినేశ్‌ ఘటన నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోన య్యాం’ అని దహియా తెలిపాడు. మొత్తంగా తాను, కోచ్‌లు పడిన కష్టాన్ని ప్రతిఫలిస్తూ అమన్‌ కాంస్య పతకంతో అదరగొట్టాడు.

Updated Date - Aug 11 , 2024 | 02:17 AM