Share News

NRI: శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో “సింగపూర్ సంక్రాంతి శోభ” కార్యక్రమం

ABN , Publish Date - Jan 28 , 2024 | 02:55 PM

శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో “సింగపూర్ సంక్రాంతి శోభ” కార్యక్రమం ఆద్యంతం అంతర్జాల వేదికగా అలరించింది.

NRI: శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో “సింగపూర్ సంక్రాంతి శోభ” కార్యక్రమం

శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో “సింగపూర్ సంక్రాంతి శోభ” కార్యక్రమం ఆద్యంతం అంతర్జాల వేదికగా అలరించింది. సింగపూర్ వాస్తవ్యులైన పెద్దలు పిల్లలు కలిసి సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ సంబరాల్లో ఆనందంగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని సంస్థ కార్యక్రమాలను కృషిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి ప్రకృతి పండుగ అని, స్నేహ సంబంధాలు పెంచి ఆత్మీయతను పంచే పండుగ అని అన్నారు. విదేశాలలో ఈ తరం పిల్లలను కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కలుపుకుంటూ మన సంప్రదాయక విలువలను వారికి తెలియజేసే విధంగా వివిధ పండుగల వేడుకలను నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు. సింగపూర్‌లో సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ చేసే దిశగా ఈ సంస్థ మరిన్ని కార్యక్రమాలను చెయ్యాలని దీవించారు.

3.jpg

ఆత్మీయ అతిథులుగా సీనియర్ బీజేపీ నాయకులు, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి, ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు పాల్గొని, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్‌లో తెలుగు సంస్కృతి కోసం చేస్తున్న సేవలను అభినందించారు. అలాగే సింగపూర్‌లో సంగీత సాహిత్యాలలో అపారమైన ప్రతిభ ఉన్న వారు ఉన్నారని వారందరినీ ఈ వేదికాముఖంగా కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్‌కు చెందిన ‘స్వర లయ ఆర్ట్స్’ విద్యార్థులు ప్రదర్శించిన గొబ్బిళ్ళ పాటలు, సంప్రదాయబద్ధమైన ఆటలు, ముగ్గులు, భోగి పళ్ళు, హరిదాసు వేషధారణ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

2.jpg


సింగపూర్‌లో ఉండే తెలుగు ప్రజలలో మంచి కళా సృజన, రసాత్మకత నిండి ఉన్నాయని, వారి ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఇటువంటి వేదికలు మరిన్ని ఏర్పాటు చేసే దిశగా తమ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. తమకు గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖులైన ఇతర ఆత్మీయ అతిథులు అందించిన అభినందనలు ఆశీస్సులు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అన్నారు. అతిథులకు కళాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

4.jpgరాధిక మంగిపూడి సభానిర్వహణలో, విద్యాధరి కాపవరపు, సౌభాగ్య లక్ష్మీ తంగిరాల, షర్మిల చిత్రాడ, శేషు కుమారి యడవల్లి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, కృష్ణ కాంతి, తదితర గాయనీమణులు చక్కటి సంక్రాంతి పాటలను ఆలపించారు. అలాగే సింగపూర్ సాహితీ ప్రతిభను కూడా నిరూపిస్తూ అపర్ణ గాడేపల్లి, సుబ్బు.వి.పాలకుర్తి, ఫణీశ్ ఆత్మూరి, స్వాతి జంగా, రోజా రమణి ఓరుగంటి, కవిత కుందుర్తి, శైలజ శశి ఇందుర్తి, శాంతి తెల్లదేవరపల్లి తదితరులు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరిస్తూ తెలుగు పద్యాలు, సంక్రాంతి కవితలు రచించి వినిపించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భారద్వాజ్, సుధాకర్ జొన్నాదులు, భాస్కర్ ఊలపల్లి, రాంబాబు పాతూరి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు

రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సారథ్యంలో ఈ కార్యక్రమం శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ & ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ లింక్ ద్వారా వీక్షించండి.

6.jpg5.jpg8.jpg7.jpg

Updated Date - Jan 28 , 2024 | 02:57 PM