NRI: ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీత సాక్షిగా ప్రమాణస్వీకారం..చరిత్ర సృష్టించిన వరుణ్ ఘోష్!
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:20 PM
ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీత సాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి భారత సంతతి సెనెటర్గా వరుణ్ ఘోష్ అరుదైన ఘనత సాధించారు.
![NRI: ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీత సాక్షిగా ప్రమాణస్వీకారం..చరిత్ర సృష్టించిన వరుణ్ ఘోష్!](https://media.andhrajyothy.com/media/2023/20231205/1_53098e3abc.jpg)
ఎన్నారై డెస్క్: వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి న్యాయవాది వరుణ్ ఘోష్ (Varun Ghosh) చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో (Australia Parliament) భగవద్గీత సాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి భారత సంతతి సెనెటర్గా అరుదైన ఘనత సాధించారు. మంగళవారం ఆయన సెనెటర్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రజల తరపున తన వాణిని వినిపించేందుకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎగువ, దిగువ సభలు ఆయనను నామినేట్ చేశాయి.
ఈ అవకాశం దక్కడంపై వరుణ్ ఘోష్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అత్యున్న ప్రమాణాలతో విద్య, శిక్షణ అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. పార్లమెంటులో వరుణ్ ఘోష్ రావడంపై పలువురు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. లేబర్ సెనెట్ టీంలో వరుణ్ ఘోష్ చేరిక ఆనందదాయకమని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని ఆల్బనీస్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
1985లో జన్మించిన వరుణ్ ఘోష్ వృత్తిరీత్యా న్యాయవాది. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రెన్ ఆస్ట్రేలియాలో ఆయన ఆర్ట్స్, లా డిగ్రీలో పట్టభద్రుడయ్యారు. ఆయన పెర్త్లో స్థిరపడ్డారు. తన కెరీర్లో ఆయన పలు బ్యాంకులు, రిసోర్స్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలకు న్యాయసేవలు అందించారు. వరల్డ్ బ్యాంక్కు కన్సల్టెంట్గా కూడా సేవలందించారు.