Share News

హిందుత్వం బలపడితే భయమెందుకు?

ABN , Publish Date - May 04 , 2024 | 04:56 AM

ఈ సాధారణ ఎన్నికల్లో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో హిందుత్వంపై తీవ్రస్థాయిలో విషం కక్కుతున్నాయి. ఇది ముమ్మాటికి...

హిందుత్వం బలపడితే భయమెందుకు?

ఈ సాధారణ ఎన్నికల్లో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో హిందుత్వంపై తీవ్రస్థాయిలో విషం కక్కుతున్నాయి. ఇది ముమ్మాటికి సరికాదు. ఈ దేశ అస్తిత్వాన్ని, మెజారిటీ ప్రజల మనోభావాలను కాలరాసే విధంగా మాట్లాడటం, వ్యంగంగా చలోక్తులు విసరడం, హిందుత్వంపైనా అయోధ్య రామ మందిరంపైనా విమర్శలు గుప్పించడం దుర్మార్గం. ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేస్తూ, హిందువుల గుండెలపై గునపాలు దించే స్థాయిలో తీవ్ర పదజాలాన్ని ఉపయోగించడం ఏ మాత్రం భావ్యం కాదు. అసలు హిందుత్వం బలపడితే ఈ నేతలకు భయం ఎందుకు?


ఇటీవల భువనగిరి బహిరంగ సభలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, అయోధ్య శ్రీరాముడి అక్షింతల పంపిణీ, ప్రసాదం వితరణ, శ్రీరామనవమి రోజు కాషాయ జెండాల అలంకరణ, దేవుడి ఊరేగింపులు, దేవుడి తీర్థప్రసాదాల పంపిణీపై హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా మాట్లాడారు. కాషాయ జెండాలు మన పొలాలకు నీరు తీసుకొస్తాయా, కడుపు నింపుతాయా? అని వ్యంగంగా విమర్శించారు. అదే సందర్భంలో ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు నేను సెక్యులర్‌ను అంటూనే ఉర్దూలో మాట్లాడుతూ హిందుత్వంపై బురదజల్లారు. రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీ చేశాను అని తనకు తాను కితాబిచ్చుకున్నారు. అంటే రంజాన్‌కు తోఫా ఇస్తే సెక్యులరిజం, శ్రీరామనవమి రోజు ప్రసాదం పంపిణీ చేస్తే మతోన్మాదమా? అంతకుముందు బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ, ‘జైశ్రీరామ్ నినాదాలు కడుపు నింపుతాయా, ఉద్యోగాలు ఇస్తాయా?’ అంటూ హిందుత్వాన్ని, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని చులకన చేసే విధంగా మాట్లాడి హిందూ వ్యతిరేకతను ప్రదర్శించాడు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి భారత్‌ను హిందూ దేశంగా మారుస్తున్నారని, రాజ్యాంగాన్ని రద్దు చేసి, మనువాద ధర్మాన్ని తీసుకువస్తారని మాట్లాడటం ఏ మాత్రం క్షమార్హం కాదు. రేవంత్ రెడ్డి ఇటీవల ఖమ్మం సభలో మాట్లాడుతూ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలను ప్రస్తావించడం, దేవుళ్ళ పేరుతో ర్యాలీలు తీసి ఓట్లు దండుకుంటున్నారని విమర్శించడం రాజకీయ దిగజారుడుతనమే. తన పార్టీ గెలుపు కోసం, ముస్లింల మెప్పు కోసం హిందుత్వంపై విషం చిమ్మడం ఘోరం. ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారని ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు పొందే దుర్మార్గపు మాటల వెనక వారి హిందూ ద్వేషం కనబడుతోంది. తమ పార్టీ అగ్ర నేతల (హిందూ విరోధుల) మెప్పు కోసం తాపత్రయపడుతూ మాట్లాడిన మాటలే ఇవి. ఇటలీ భావజాలం గల నేతలను ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ గారు హిందుత్వాన్ని ఫణంగా పెట్టడం ఏ మాత్రం తగదు. హిందుత్వాన్ని విమర్శిస్తే మరిన్ని మార్కులు పడతాయనే దురాలోచనలతో మాట్లాడటం హిందూ సమాజం హర్షించదు. మతం ఆధారంగా విడిచిపోయిన భారత భూభాగంలో నేడు హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. హిందువుల ఆనవాళ్లు మాయమయ్యాయి. ప్రస్తుతం కశ్మీర్, బెంగాల్, కేరళ, అస్సాం తదితర ప్రాంతాల్లో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నేడు మిగిలి ఉన్న ఈ మాత్రం భారత్‌ను కూడా కబళించడమే కాంగ్రెస్ లక్ష్యమా? అని హిందూ సమాజం ప్రశ్నిస్తోంది.


కమ్యూనిస్టుల విషయం వేరే చెప్పక్కర్లేదు. ఈ రాత్రికి రాత్రే హిందుత్వాన్ని అంతం చేయాలనేది వారి ప్రధాన లక్ష్యం. వీటికి తోడు మజిలీస్ పార్టీ విషయం తెలిసిందే. పోలీసులు పక్కకు జరిగితే ‘15 నిమిషాల్లో హిందువులను అంతం చేస్తా’మని మజిలీస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచానికి సుపరిచితమే.

అయితే ఈ నేతల ఆలోచన సరళి పరిశీలిస్తే– హిందుత్వం బలపడితే మన మనుగడ ప్రశ్నార్థకం అనే బెంగ బలంగా పట్టుకున్నట్టు ఉంది. అందుకే అవకాశం వచ్చిన ప్రతి సందర్భాన్నీ ఉపయోగించుకొని, హిందుత్వాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందుకు బదులుగా సెక్యులర్ అనే తేనె పూసిన కత్తిని వాడుతున్నారు.

ఈ దేశంలో హిందుత్వాన్ని సమాధి చేయాలనుకునే నేతల మాటలను ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి, చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలి. మెజారిటీ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న ఆయా పార్టీలు, నేతలపై చట్టపరమైన చర్యలకు వెనకాడకూడదు. హిందుత్వం బలపడితేనే భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచంలో ఒకే ఒక్క హిందూ దేశంగా ఉన్న భారత్‌ను కూడా కబళించాలనే కుట్రలకు నేడు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. ఈ చర్యలతో హిందుత్వాన్ని ప్రమాదంలోకి తోసేసేందుకు నేతల కుట్రలు ఫలిస్తే ఇక అంతే సంగతులు..! ‘భారతదేశంలో హిందువులు కూడా ఉండేవారు’ అని చరిత్రలో రాసుకోవాల్సిందే తప్ప చేసేదేముండదు.


ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాల వల్లనే ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తదితర భూభాగాలను మతం ఆధారంగా భారతదేశం కోల్పోయిన విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రాజకీయ కుట్రల కారణంగా మిగిలి ఉన్న భారత భూమిని కూడా హిందువులకు దూరం చేసే కుట్ర బలంగా సాగుతోంది. దీనిపై రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలి. హిందుత్వాన్ని, కాషాయ జెండాలను, హనుమాన్ జయంతిని, శ్రీరామనవమి వేడుకలను అప్రతిష్టపాలు చేస్తున్న నేతలకు బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే హిందుత్వ మనుగడ ప్రశ్నార్థకమే!

ఓట్ల కోసం హిందూ ధర్మాన్ని పణంగా పెట్టడాన్ని విరమించుకోవాలని హిందూ సమాజం కోరుకుంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల్లో హిందూ జనాభా నిష్పత్తి శాతం, నేడు రాజకీయ కారణాల కారణంగా ఉన్నటువంటి హిందూ జనాభా నిష్పత్తి శాతం గమనిస్తే హిందువుల సంఖ్య రోజురోజుకు ఎంత తగ్గుతూ పోతున్నదో బోధపడుతుంది. హిందూ సమాజంలో చాలామంది మతం మారినప్పటికీ హిందువులుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా హిందువుల జనాభా పరిగణిస్తే భయంకరమైన వాస్తవాలు బయటపడతాయి. ఉన్న కొద్దిపాటి హిందూ సమాజాన్ని కూడా కాలరాసే కుట్రలను కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు, తదితర సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే అన్ని రాజకీయ పార్టీలు మానుకోవాలి.

ఐదు శతాబ్దాల నాటి మరకలను చెరిపి, ఇప్పుడిప్పుడే అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నాం. ఆ రామ మందిరాన్ని చూసి ఓర్వలేకపోవడం, విమర్శలు గుప్పించడం వంటి దుర్మార్గపు పనులు చేయవద్దని హిందూ సమాజం అభ్యర్థిస్తోంది. ముస్లింల ఓట్లతో గద్దెనెక్కి హిందూ సమాజాన్ని అంతం చేయాలని చూడటం ఈ రాజకీయ నాయకులకు సరికాదని హిందూ సమాజం హెచ్చరిస్తుంది.

పగుడాకుల బాలస్వామి

ప్రచార ప్రసార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్, తెలంగాణ

Updated Date - May 04 , 2024 | 04:56 AM