Share News

జన్మభూమిలో రఘురాముడు

ABN , Publish Date - Jan 14 , 2024 | 03:53 AM

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో, జనవరి 22, 2024 మధ్యాహ్నం 12.20 గంటల శుభముహూర్తాన జరుగనున్న ‘ప్రాణ ప్రతిష్ఠ వేడుక’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న...

జన్మభూమిలో రఘురాముడు

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో, జనవరి 22, 2024 మధ్యాహ్నం 12.20 గంటల శుభముహూర్తాన జరుగనున్న ‘ప్రాణ ప్రతిష్ఠ వేడుక’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదే రోజున దేశ ప్రజలంతా వారివారి ఇళ్లల్లో ‘రామజ్యోతి’ వెలిగించి ఆ వేడుకను జరుపుకోవాలని, పెద్ద సంఖ్యలో ఒకేసారి అందరూ అయోధ్యకు వచ్చి ఇబ్బందికి గురికావద్దనీ విజ్ఞప్తి చేశారు.

‘శ్రీ రామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్’ సభ్యులు ఎంపిక చేసిన, 51 అంగుళాల ‘రామ్ లల్లా’ విగ్రహానికి ప్రాణశక్తిని ఆవాహన చేసే ‘ప్రాణ ప్రతిష్ఠ వేడుక’ను, ఆలయాల ఆచారానికి, సాంప్రదాయానికి అనుగుణంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. దీన్ని పురస్కరించుకుని ఏడు రోజులపాటు నిర్విరామంగా జరుగనున్న సాంప్రదాయ, ఆచారబద్ధమైన కార్యక్రమాలు జనవరి 16న ప్రారంభం అవుతున్నాయి. వీటికి పూర్వరంగంలో, ట్రస్ట్ కార్యదర్శి చంపట్ రాయ్ పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమానికి ఆంగ్ల నూతన సంవత్సరం నాడు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

మహర్షి వాల్మీకి రచించిన ఆదికావ్యం సంస్కృత రామాయణంలో ‘రామజన్మభూమి’గా ప్రసిద్ధికెక్కిన అయోధ్యకు సంబంధించిన అనాది కాలంనాటి అనేక విషయాలను స్పష్టంగా వర్ణించారు. ఇప్పటిలాగానే, ఆ కాలంలో కూడా సరయూ నది ఒడ్డున వున్న అయోధ్యా నగరానికి ఒకవైపున ‘గంగా, పంచల ప్రదేశ్’, మరోవైపున ‘మిథిలా’ ఉండేవి. కాలక్రమేణా అయోధ్య పరిమాణంలో కుంచించుకుపోవడమే కాకుండా, అక్కడి నదులు వాటి మార్గాన్ని మార్చుకున్నాయి. వర్తమాన పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ విజన్ మేరకు అయోధ్య నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నారు. పరంపరగా వస్తున్న దాని అద్భుతమైన వారసత్వాన్ని సంరక్షించే దిశగా పనులు జరుగుతున్నాయి.

సంస్కృత భాషలో వాల్మీకి రచించిన రామాయణాన్ని, మూలంలోని 24,000 శ్లోకాలకు, శ్లోకానికి ఒకటి చొప్పున, తెలుగులో 24,000 పద్యాలతో, ప్రతిపదార్థ తాత్పర్యసహితంగా, ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధికెక్కిన స్వర్గీయ వావిలికొలను సుబ్బారావు తొమ్మిది సంపుటాలలో ‘శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం’ పేరుతో వందేళ్ల క్రితం అనువదించారు. ఈ మందర సంపుటాలను సమకాలీన ‘ఆధ్యాత్మిక, బహువిషయ విజ్ఞానసర్వస్వాలు’గా విస్తృతంగా భావిస్తారు. సంస్కృత వాల్మీకి రామాయణం, వావిలికొలను సుబ్బారావు తెలుగు యథావాల్మీకం అలనాటి అయోధ్యను కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి. సరయూ నదీతీరంలోని కోసల దేశంలో వున్న అయోధ్యా నగరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో వుండేవారు. చక్కటి రాజవీధులతో అలరారుతూ, అందాలొలికే ఆ అయోధ్యాపురం ‘లక్ష్మీపురం’నే మరిపించేది. స్వర్గ నగరమైన అమరావతికి దీటుగా వుండేది. అయోధ్యాపురంలోని బ్రాహ్మణులు అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేసేవారు. వేదాధ్యయనం చేయడం వారికి నిత్యకృత్యం. బ్రాహ్మణులు ఉపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు చేదోడువాదోడుగా కులవృత్తులలో నిమగ్నమై కార్మిక, కర్షక వర్గాల వారు ఉండేవారు. అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే.

అయోధ్యా నగరాన్ని ఇక్ష్వాకుల సూర్య వంశానికి చెందిన దశరథ మహారాజు, సమర్థులైన మంత్రుల తోడ్పాటుతో పరిపాలించేవాడు. చైత్ర మాసం, శుక్లపక్షం, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, అభిజిల్లగ్నం, కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయాన, దశరథుడి జ్యేష్ట భార్య కౌసల్యాదేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు అర్థాంశమూర్తి శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఆ విధంగా, అలనాటి అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం, లేదా, రామజన్మభూమి అయింది. ఆ పరంపరతో, అదే అయోధ్య, ఈ నాడు ‘రామ్ లల్లా విగ్రహం’ ఉండే చారిత్రాత్మక రామ మందిరానికి నిలయమైంది.

ఆధునిక భారతదేశ చరిత్రలో ‘అయోధ్య వివాదం’ వివిధ న్యాయ స్థానాలలో ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయోధ్యలోని ఒక ప్రాచీన కట్టడంలో వున్న వివాదాస్పద స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని, అదే ఆయన జన్మభూమని, అక్కడొక రామాలయం వుండేదని, దాన్ని 1528 లో బాబర్ కూలగొట్టించి బాబ్రీ మసీదు నిర్మించాడని అందువల్ల ఆ స్థలంపై హక్కు తమదేనని హిందువులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదానికి స్వస్తివాక్యం పలుకుతూ, నవంబర్ 9, 2019న ఐదుగురు సభ్యులున్న సుప్రీంకోర్ట్ ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఇచ్చిన ఆదేశంలో, అయోధ్యలో వివాదాస్పద స్థలంలో ‘రామ్ మందిర్ దేవాలయం’ నిర్మించడానికి ట్రస్ట్‌ను, ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయమని చెప్పింది.

ఆలయాన్ని నిర్మించేందుకు 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని హిందువుల ఆరాధ్య దైవం, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు ‘రామ్ లల్లా విరాజ్మాన్’కు అప్పగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010 అలహాబాద్ హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు, వివాదాస్పద భూమి విభజన సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు, అయోధ్యలో ‘రామ్ మందిర్ దేవాలయం’ నిర్మించడానికి, ఫిబ్రవరి 5, 2020న 15 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ. నిర్మాణానికి అవసరమయ్యే అంచనా వ్యయమైన రూ.18,000 కోట్లను ప్రజల నుండి విరాళాలుగా సేకరిస్తున్నారు ట్రస్ట్ సభ్యులు. మొట్టమొదటి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇచ్చింది. ఆగస్ట్ 5, 2020న ప్రధాన మంత్రి భూమిపూజ చేసి ఆలయ పునాదిరాయి వేశారు. డిజైన్ మార్పువల్ల నిర్మిస్తున్న ‘రామ్ మందిర్ దేవాలయం’ మొదట్లో అనుకున్న దానికంటే రెండింతలవుతున్నది. ట్రస్ట్‌కు కేటాయించిన 70 ఎకరాల భూమి మీద 2.77 ఎకరాల స్థలంలో రామ్ లల్లా కేంద్ర బిందువుగా నిర్మిస్తున్న ప్రధాన దేవాలయంతో సహా అనేక ఆలయాల నిర్మాణం జరుగుతున్నది. అష్టభుజ ఆకారపు గర్భగుడి, వృత్తాకార చుట్టుకొలతల నిర్మాణాలు కూడా అక్కడ ఉండబోతున్నాయి. ఆలయం నాలుగు మూలల గోడతో చుట్టబడిన 750 మీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రాకారం కలిగివుంటుంది. భక్తులు ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లున్నాయి.

‘రామ్ మందిర్’ నిర్మాణానికి పరిపూర్ణ కృషి చేసిన వ్యక్తిగా మోదీని యావత్ హిందూ సమాజానికి చెందిన ఆబాలగోపాలం, ఆసేతు హిమాచలం ఎప్పటికీ విధేయతతో జ్ఞాపకం ఉంచుకుంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే, ఆలయాన్ని కట్టాలని గుండె లోతుల్లోంచి భావించినా, కట్టలేకపోయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు, అయోధ్య వివాదాస్పద కేసును విజయవంతంగా వాదించిన సీనియర్ అడ్వకేట్, 96ఏళ్ల పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కె పరాశరన్‌కు, 1949 లోనే నెహ్రూ ఆదేశాలను కాదని రామజన్మభూమిలో పూజలు చేసుకోవడానికి హిందువులకు హక్కు కల్పించిన నాటి ఫైజాబాద్ కలక్టర్ స్వర్గీయ కేకే నాయర్‌కు కూడా ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు ధన్యవాదాలు తెలియచేయడం కనీస ధర్మం.

వనం జ్వాలానరసింహారావు

Updated Date - Jan 14 , 2024 | 03:53 AM