Share News

డిటెన్షన్ విధానం సరికాదు

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:42 AM

2009 విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలులో ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ 5, 8 తరగతుల విద్యార్థులకు డిటెన్షన్ విధానం తీసుకువచ్చింది. ఈ విధానం కేంద్ర ప్రభుత్వం...

డిటెన్షన్ విధానం సరికాదు

2009 విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలులో ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ 5, 8 తరగతుల విద్యార్థులకు డిటెన్షన్ విధానం తీసుకువచ్చింది. ఈ విధానం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది.

విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 16 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో 8వ తరగతి వరకు ఏ విద్యార్థినీ కూడా అదే తరగతిలో మళ్ళీ కొనసాగించేందుకు లేదా పాఠశాల నుంచి తొలగించేందుకు వీలులేదు. దీనినే నో డిటెన్షన్ విధానం అంటారు. పరీక్షలలో ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా విద్యార్థులు పై తరగతులకు వెడతారు. ప్రాథమిక స్థాయిలో పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడం, ఆహ్లాదకరమైన అభ్యసనం, పరీక్షల పట్ల భయం తగ్గించడం, డ్రాప్ ఔట్స్ కాకుండా చూడటం నో డిటెన్షన్ పాలసీ ప్రధాన లక్ష్యాలు.


అయితే ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే, అసెర్ నివేదికలు తేలుస్తున్నాయి. విద్యార్థులలో అభ్యసన పట్ల శ్రద్ధ తగ్గిందని, ఫలితాలకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు బోధనపై దృష్టి సారించడం లేదని విమర్శకుల వాదన. అదే విధంగా 9, 10 తరగతుల్లో డ్రాప్ ఔట్స్‌ అధికం అవుతున్నాయని వీరి విమర్శ. ప్రాథమిక స్థాయిలో 100 శాతం ఎన్‌రోల్‌మెంట్‌ ఉండగా, 9, 10 తరగతుల్లో డ్రాప్ ఔట్ శాతం 17గా ఉండటం గమనార్హం.

నో డిటెన్షన్ విధానం వల్ల అభ్యసన సామర్థ్యాలు తగ్గుతున్నాయని, దానిని మార్చవలసిందిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విజ్ఞప్తులు అందాయి. దేశంలో 23 రాష్ట్రాలు డిటెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించాయి. 2018లో విద్యా హక్కు చట్టానికి సవరణలు తెచ్చాక 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిటెన్షన్ విధానం అమలులోకి వచ్చింది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలు నో డిటెన్షన్ విధానమే కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఏ నిర్ణయమూ తీసుకోలేదు.


నూతన విధానం ప్రకారం 5, 8వ తరగతి విద్యార్థులు సంవత్సరాంతంలో నిర్వహించే పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి. ఉత్తీర్ణత సాధించని వారికి రెండు నెలల పాటు శిక్షణ అందించి, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రెండవసారి కూడా ఉత్తీర్ణత సాధించకుంటే అదే తరగతిలో కొనసాగిస్తారు. అదే తరగతిలో కొనసాగించినపుడు విద్యార్థి అభ్యసన లోపాలు గమనించి వాటిని పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలి. 8వ తరగతి పూర్తి చేయకుండా ఏ విద్యార్థినీ బడిలో నుంచి తొలగించరాదని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొంది. అందరికీ విద్య అందాలి, కానీ అదే సమయంలో విద్యార్థులు ఆశించిన సామర్థ్యాలు పొందేందుకు నూతన విధానం దోహదపడుతుందని, అభ్యసనలో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రం వాదన.

కానీ డిటెన్షన్ విధానం తిరోగాత్మక చర్యగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రాథమిక విద్యకు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యాహక్కు చట్టం ఉద్యమకారులు వాదిస్తున్నారు. డిటెన్షన్ విధానం వల్ల పిల్లల్లో పరీక్షల పట్ల భయం పెరిగే అవకాశం ఉంది. ఫెయిల్ అయిన విద్యార్థులు బడికి దూరమయ్యే ప్రమాదం ఉంది. వారిలో న్యూనతాభావం ఏర్పడుతుంది. మళ్ళీ అదే తరగతి చదవాల్సి రావటం వారిలో నిరాసక్తతను పెంచుతుంది. బాలకార్మికులు పెరిగే ప్రమాదం ఉంది. డిటెన్షన్‌ను అధిగమించేందుకు పరీక్షలలో అనైతిక విధానాలకు పాల్పడే అవకాశం ఉంది. ప్రాథమిక స్థాయిలో ఆహ్లాదంగా జరగాల్సిన అభ్యసనం ఆందోళనాయుతంగా ఉంటుంది. డిటెన్షన్ విద్యావిధానం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై, మొదటి తరం అభ్యాసకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణుల అభిప్రాయం.


నో డిటెన్షన్ విధానంలో ఉన్న లోపాలను అధిగమించేందుకు విద్యావ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావాలి. విద్యార్థుల అభ్యసనం, ఉపాధ్యాయుల బోధన అభివృద్ధిచెందేందుకు పర్యవేక్షణ ఉండాలి. అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావాలి. నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించకుండా, డిటెన్షన్ ద్వారా అవరోధాలు సృష్టించడం వారిని శాశ్వతంగా విద్యకు దూరం చేస్తుంది. అందుకని డిటెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలి.

డాక్టర్ అనుమాండ్ల వేణుగోపాలరెడ్డి

Updated Date - Dec 31 , 2024 | 12:42 AM