Share News

పీపీబీఎల్‌ చైర్మన్‌ పదవికి విజయ్‌ శేఖర్‌ శర్మ రాజీనామా

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:41 AM

ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌) పార్ట్‌టైం నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవికి విజయ్‌ శేఖర్‌ శర్మ రాజీనామా చేశారు. అలాగే, బ్యాంక్‌ బోర్డునూ పునర్‌వ్యవస్థీకరించారు...

పీపీబీఎల్‌ చైర్మన్‌ పదవికి విజయ్‌ శేఖర్‌ శర్మ రాజీనామా

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌) పార్ట్‌టైం నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవికి విజయ్‌ శేఖర్‌ శర్మ రాజీనామా చేశారు. అలాగే, బ్యాంక్‌ బోర్డునూ పునర్‌వ్యవస్థీకరించారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌ శ్రీధర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దేవేంద్రనాథ్‌ సారంగి, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌ కుమార్‌ గార్గ్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి రజినీ సెఖ్రీ సిబల్‌తో కొత్త బోర్డు ఏర్పాటు చేసినట్లు వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. వీరంతా బోర్డులో ఈమధ్యనే స్వతంత్ర డైరెక్టర్లుగా చేరినట్లు తెలిపింది. విజయ్‌ శేఖర్‌ శర్మ వైదొలిగిన నేపథ్యంలో కొత్త చైర్మన్‌ నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు పీపీబీఎల్‌ విడిగా వెల్లడించింది. ఈనెల 29 తర్వాత నుంచి పీపీబీఎల్‌ తన ఖాతాదారుల అకౌంట్లు, వాలెట్‌ వంటి ప్రీ-పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్లు, ఫాస్టాగ్‌, నేషనల్‌ కామన్‌ మొబిలిలిటీ కార్డ్స్‌లో డిపాజిట్లు, క్రెడిట్‌ లేదా టాప్‌-అప్‌ లావాదేవీలు నిర్వహించకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను మార్చి 15 వరకు పొడిగించింది.

పేటీఎంతో సలహా కమిటీ చర్చలు

వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌తో టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌పై తమ సలహా కమిటీ చర్చిస్తున్నదని కమిటీ అధ్యక్షుడు, సెబీ మాజీ చైర్మన్‌ ఎం దామోదరన్‌ తెలిపారు. పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో నియంత్రణ నియమావళి పాటించే విషయంలో కంపెనీని బలోపేతం చేసేందుకు వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఈ సలహా కమిటీని ఏర్పాటు చేసింది.

అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన షేరు

సోమవారం బీఎ్‌సఈ ట్రేడింగ్‌లో వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిం ది. 5 శాతం లాభంతో రూ.427.95కు చేరుకుంది. ‘ఎట్‌ పేటీఎం’ యూపీఐ హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్న పీపీబీఎల్‌ కస్టమర్లను ఇతర బ్యాంక్‌లకు బదిలీ చేసే అవకాశాలను పరిశీలించాలని ఎన్‌పీసీని రిజర్వ్‌ బ్యాంక్‌ కోరిన నేపథ్యంలో కంపెనీ షేర్లు పుంజుకున్నాయి.

Updated Date - Feb 27 , 2024 | 04:41 AM