Stock Market: భారీగా పతనమైన సూచీలు.. ప్రభుత్వ రంగ షేర్లలో ఒత్తిడి
ABN , Publish Date - Feb 12 , 2024 | 04:44 PM
బ్యాంకులు, ప్రభుత్వ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలను మూటగట్టుకున్నాయి.
![Stock Market: భారీగా పతనమైన సూచీలు.. ప్రభుత్వ రంగ షేర్లలో ఒత్తిడి](https://media.andhrajyothy.com/media/2023/20231205/bse_a6eb0dd261.jpg)
బ్యాంకులు, ప్రభుత్వ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 523 పాయింట్లు దిగజారగా, నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1200 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 750 పాయింట్లు దిగజారింది. కొన్ని నెలలుగా భారీగా ర్యాలీ అవుతూ వస్తున్న రైల్వే స్టాక్స్ ఆర్వీఎన్ఎల్ 11 శాతం, ఇర్కాన్ 12.5 శాతం, ఐఆర్ఎఫ్సీ 13.5 శాతం మేర పతనమయ్యాయి.
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంక్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి ప్రభావం చూపించింది. ఒక దశలో 70,922 వద్ద ఇంట్రాడే నష్టానికి చేరుకున్న సెన్సెక్స్ చివరకు 71,072 వద్ద ముగిసింది. ఇక, నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 21,616 వద్ద స్థిరపడింది. ఐటీ, హెల్త్ కేర్ రంగాలు మాత్రమే కాస్త లాభాలు అందుకున్నాయి. మిగిలిన అన్ని రంగాలూ నష్టాలను చివచూశాయి. జైడుస్ లైఫ్, ఎమ్ఆర్ఎఫ్, ఆస్ట్రాల్ ఇండియా, రెడ్డీస్ ల్యాబ్స్ లాభాలు అందుకోగా, భారత్ ఫోర్జ్, హిందుస్తాన్ కాపర్, నాల్కో భారీ నష్టాలను చవి చూశాయి.