రూ.4.5 లక్షల కోట్లు ఫట్
ABN , Publish Date - Aug 14 , 2024 | 02:30 AM
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 692.89 పాయింట్లు కోల్పోయి 78,956.03 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 208 పాయింట్లు క్షీణించి 24,139 వద్ద స్థిరపడింది....
10లో 7 అదానీ షేర్లకు నష్టం
సెన్సెక్స్ 693 పాయింట్లు డౌన్
79,000 దిగువ స్థాయికి సూచీ
నిఫ్టీ 208 పాయింట్లు పతనం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 692.89 పాయింట్లు కోల్పోయి 78,956.03 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 208 పాయింట్లు క్షీణించి 24,139 వద్ద స్థిరపడింది. హెచ్డీఎ్ఫసీ బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ వంటి బ్లూచిప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణతోపాటు చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయన్న ఆందోళనలు మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయని ఈక్విటీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఉదయం తొలి గంట ట్రేడింగ్లో స్వల్ప లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్ సూచీలకు ఆ తర్వాత నష్టాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దాంతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎ్సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.52 లక్షల కోట్లు తగ్గి రూ.445.30 లక్షల కోట్లకు (5.30 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. సెన్సెక్స్లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోయాయి. హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ 3.46 శాతం పతనమై సూచీ టాప్ లూజర్గా మిగిలింది.
బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్స్ రెండు శాతానికి పైగా నష్టపోయాయి. హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ట్రేడయ్యాయి. గ్రూప్లోని 10 కంపెనీల్లో 7 స్వల్పంగా నష్టపోగా.. అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మాత్రం పాజిటివ్గా ముగిశాయి.
యూనికామర్స్ బంపర్ లిస్టింగ్
సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులు కలిగిన యూనికామర్స్ ఈసొల్యూషన్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్కు అపూర్వ స్పందన లభించింది. గతవారంలో ఐపీఓను ముగించుకున్న కంపెనీ.. మంగళవారం షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఇష్యూ ధర రూ.108తో పోలిస్తే, బీఎ్సఈలో కంపెనీ షేరు ఏకంగా 112.96 శాతం ప్రీమియంతో రూ.230 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 137.17 శాతం వృద్ధితో రూ.256.15 వరకు ఎగబాకిన షేరు ధర.. మధ్యాహ్నం నుంచి మళ్లీ తగ్గుతూ వచ్చింది. తొలిరోజు ట్రేడింగ్ నిలిచేసరికి 94.49 శాతం లాభంతో రూ.210.05 వద్ద స్థిరపడింది.