దేశంలో తగ్గిన ఆదాయ అంతరాలు
ABN , Publish Date - Jan 09 , 2024 | 03:10 AM
దేశంలో ఆదాయ అంతరాలు తగ్గాయని ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉండే వ్యక్తులు 2013-22 మధ్య కాలంలో ఫైల్ చేసిన ఐటీ రిటర్న్ల సంఖ్య...
![దేశంలో తగ్గిన ఆదాయ అంతరాలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/4_Business_07202f76ef.jpg)
సరైన బాటలోనే వృద్ధి రేటు: ఎస్బీఐ రీసెర్చ్
న్యూఢిల్లీ: దేశంలో ఆదాయ అంతరాలు తగ్గాయని ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉండే వ్యక్తులు 2013-22 మధ్య కాలంలో ఫైల్ చేసిన ఐటీ రిటర్న్ల సంఖ్య 295 శాతం పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. ఇదే సమయంలో రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్ల సంఖ్యా 291 శాతం పెరిగిందని తెలిపింది. 2021-22 అసెస్మెంట్ ఇయర్లో ఏడు కోట్ల మంది ఐటీ రిటర్న్లు ఫైల్ చేయగా 2023-24 అసెస్మెంట్ ఇయర్కి ఈ సంఖ్య 8.2 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఆదాయ అంతరాల పరిశీలనకు ప్రామాణికంగా భావించే జినీ కోఎఫీషియెన్సీ ప్రకారం చూసినా ఆదాయ అంతరాలు 2014-22 ఆర్థిక సంవత్సరాల మధ్య అంతరం 0.472 నుంచి 0.403కి తగ్గిన విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ గుర్తు చేసింది.
సజావుగానే వృద్ధి రేటు
కొవిడ్ తర్వాత భారత ఆర్థిక వృద్ధి రేటు ఇంగ్లీషు అక్షరం ‘కే’ రూపంలో కొన్ని రంగాల్లో పెరిగి, కొన్ని రంగాల్లో క్షీణిస్తుందంటూ కొంతమంది ఆర్థికవేత్తలు వేసిన అంచనాలనీ ఎస్బీఐ తోసిపుచ్చింది. వీరి అంచనాలు దురుద్దేశాలతో కూడినవని తెలిపింది. ప్రస్తుతం అన్ని రంగాలు సరైన వృద్ధి బాటులోనే ఉన్నట్టు తెలిపింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో సహా పలువురు ఆర్థికవేత్తలు కొవిడ్ తర్వాత భారత ఆర్థిక వృద్ధి రేటు ‘కే’ రూపంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.