Share News

వచ్చే ఏడాదీ ఐటీకి కష్టాలే

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:44 AM

భారత ఐటీ కంపెనీలకు అమెరికా, కెనడా, యూరప్‌ దేశాలు ప్రధాన మార్కెట్లు. ప్రస్తుతం ఈ దేశాలన్నీ అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లతో సతమతమవుతున్నాయి. తప్పనిసరైతేనే వ్యాపార విస్తరణకు పోవడం లేదు...

వచ్చే ఏడాదీ ఐటీకి కష్టాలే

నియామకాలూ అంతంత మాత్రమే

లాభాలకు మాత్రం ఢోకా ఉండదు.. ఇక్రా రేటింగ్స్‌ అడ్డంకులున్నాయ్‌..

భారత ఐటీ కంపెనీలకు అమెరికా, కెనడా, యూరప్‌ దేశాలు ప్రధాన మార్కెట్లు. ప్రస్తుతం ఈ దేశాలన్నీ అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లతో సతమతమవుతున్నాయి. తప్పనిసరైతేనే వ్యాపార విస్తరణకు పోవడం లేదు. దీంతో ఆ కంపెనీలు ఐటీ ఖర్చులూ తగ్గించుకున్నాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే తప్ప ఈ దేశాల నుంచి భారత ఐటీ కంపెనీలకు ఇదివరకటిలా ఆర్డర్లు పెద్దగా వచ్చే అవకాశం లేదు.

జీతాల పెంపు అంతంత మాత్రమే

పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో దేశీయ ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా గత ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా జీతాల పెంపు 8.4 శాతం నుంచి 9 శాతం మించక పోవచ్చని భావిస్తున్నారు. మళ్లీ ఈ పెంపు ఉద్యోగులు అందరికీ ఉంటుందా? లేక కొందరికేనా? అనేది పెద్ద డౌట్‌. ఎందుకంటే గత ఏడాది ప్రముఖ ఐటీ కంపెనీలు జూనియర్లు, ఫ్రెషర్స్‌ను పక్కన పెట్టి సీనియర్లకు మాత్రమే జీతాలు పెంచాయి. ఈ సంవత్సరం కూడా ఐటీ కంపెనీలు అదే విధానం అనుసరిస్తాయని భావిస్తున్నారు.

తగ్గనున్న వలసలు

పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారే ఉద్యోగుల సంఖ్యా 12-13 శాతం మించకపోవచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి తొమ్మిది నెలల్లో ఐటీ కంపెనీల స్థూల ఆదాయాలు 9.2 శాతం పెరిగినా, నికర ఆదాయాల వృద్ధి రేటు 2 శాతం మించలేదు. పరిశ్రమ అంచనా వేసిన 3-5 శాతం కంటే ఇది తక్కువ.

లాభాలకు ఢోకా లేదు

ఆదాయాల వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉన్నా 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ కంపెనీల లాభాలకు ఢోకా ఉండదని ఇక్రా రేటింగ్స్‌ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత ఐటీ కంపెనీల నిర్వహణ లాభాలు 21 నుంచి 22 శాతం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇన్ని ఆటుపోట్లు ఉన్నా భారత ఐటీ కంపెనీల స్థిరత్వానికి ఢోకా లేదని పేర్కొంది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కంపెనీల నుంచి ప్రాజెక్టుల ఆర్డర్లు తగ్గినా.. కీలకమైన టెక్నాలజీ నిర్వహణ ఆర్డర్లు ఇంకా వస్తూనే ఉన్నట్టు తెలిపింది.

ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) కూడా దేశీయ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐటీ) రంగానికి కలిసొచ్చేలా లేదు. ఈ కాలానికి భారత ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి రేటు 3 నుంచి 5 శాతం మించకపోవచ్చు. దేశీయ పరపతి రేటింగ్‌ సంస్థ ‘ఇక్రా రేటింగ్స్‌’ సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. ఆదాయ వృద్ధి పెద్దగా లేకపోవడంతో ఐటీ కంపెనీలు పెద్దగా నియామకాల జోలికీ పోకపోవచ్చని ఆ నివేదిక పేర్కొంది.

Updated Date - Mar 19 , 2024 | 03:44 AM