కొత్త నియామకాలు ఆగవు..
ABN , Publish Date - Sep 28 , 2024 | 05:31 AM
ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. తమ కంపెనీలో కొత్త నియామకాలు ఏ మాత్రం ఆగవని ప్రముఖ ఐటీ సేవలు, కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ స్పష్టం చేసింది. ఈ నియామకాల్లో ఫ్రెషర్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కంపెనీ గ్లోబల్ చైర్పర్సన్, సీఈఓ జూలీ స్వీట్
ఫ్రెషర్స్పైనే ఎక్కువ దృష్టి
జెనరేటివ్ ఏఐపై ప్రత్యేక ఫోకస్
యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. తమ కంపెనీలో కొత్త నియామకాలు ఏ మాత్రం ఆగవని ప్రముఖ ఐటీ సేవలు, కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ స్పష్టం చేసింది. ఈ నియామకాల్లో ఫ్రెషర్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కంపెనీ గ్లోబల్ చైర్పర్సన్, సీఈఓ జూలీ స్వీట్ ఇన్వెస్టర్స్ కాల్స్కు సమాధానం ఇస్తూ తెలిపారు. కొత్త నియామకాల్లో ఎక్కువ భాగం భారత్లోనే ఉంటాయని ఆమె చెప్పారు. ‘మేము భారత్లో నియామకాలు పెంచుతున్నాం. ఇందులో ఎక్కువ నియామకాలు టెక్నాలజీకి సంబంధించిన నియామకాలు. అక్కడ ఇప్పటికే ఉన్న ఉద్యోగుల నైపుణ్యాలు పెంచేందుకూ ప్రత్యేక శిక్షణా కార్యకాపాలు చేపడుతున్నాం’ అన్నారు. అయితే భారత్లో ఎంత మంది ఉద్యోగులను కొత్తగా తీసుకునేది యాక్సెంచర్ సీఈఓ వెల్లడించలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా యాక్సెంచర్ కేంద్రా ల్లో 7.74 లక్షల మంది పనిచేస్తుంటే అందులో మూడు లక్షల మందికి పైగా భారత్లోనే పని చేస్తున్నారు.
జెన్ ఏఐపై 80,000 మందికి శిక్షణ
ఇతర ఐటీ కంపెనీల్లానే యాక్సెంచర్ కూడా జెనరేటివ్ ఏఐపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. తమ క్లయింట్లలో ఎక్కువ మంది టెక్, డేటా, ఏఐ, పనితీరుకు సంబంధించి కొత్త విధానాలకు మారినందున తాము కూడా అందుకు అనుగుణంగా మారక తప్పడం లేదని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ అన్నారు. ‘మా ఉద్యోగుల్లో ఇప్పటికే దాదాపు 57,000 మందికి ఏఐ, డేటా టెక్నాలజీపై శిక్షణ ఇచ్చాం. 2026 ఆర్థిక సంవత్సరం చివరినాటికి 80,000 మందికి ఈ టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆమె తెలిపారు. యాక్సెంచర్ ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే దాదాపు 4.4 కోట్ల గంటల పాటు తన ఉద్యోగులకు ఏఐతో సహా వివిధ టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.