Share News

రూ.129 లక్షల కోట్లు 2023-24లో మార్కెట్‌ సంపద వృద్ధి ఇది..

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:01 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో స్టాక్‌ మార్కెట్‌ కొనుగోళ్ల జాతరలా కళకళలాడింది. సూచీల రికార్డులతో దలాల్‌ స్ట్రీట్‌ దద్దరిల్లింది. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 14,659.83 పాయింట్లు (24.85 శాతం) పుంజుకుంది...

రూ.129 లక్షల కోట్లు 2023-24లో మార్కెట్‌ సంపద వృద్ధి ఇది..

ఏడాదిలో 14,660 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

సరికొత్త రికార్డు గరిష్ఠాలకు ఈక్విటీ సూచీలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో స్టాక్‌ మార్కెట్‌ కొనుగోళ్ల జాతరలా కళకళలాడింది. సూచీల రికార్డులతో దలాల్‌ స్ట్రీట్‌ దద్దరిల్లింది. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 14,659.83 పాయింట్లు (24.85 శాతం) పుంజుకుంది. ఈ నెల 7న సూచీ 74,245.17 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ విషయానికొస్తే, ఏడాది కాలంలో 4,967.15 పాయింట్లు (28.61 శాతం) లాభపడింది. గడచిన ఏడాది కాలంలో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఏకంగా రూ.128.77 లక్షల కోట్లు పెరిగి మొత్తం రూ.386.98 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండటంతో పాటు మార్కెట్లోకి పెట్టుబడులు భారీగా తరలి రావడం, కార్పొరేట్‌ కంపెనీల ఆశాజనక పనితీరు మార్కెట్‌ ర్యాలీకి ప్రధానంగా దోహదపడ్డాయి.

స్మాల్‌, మిడ్‌క్యాప్‌లదే హవా

ఈ ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. చాలా కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్‌ రిటర్నులు పంచాయి. 2023-24లో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 70 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 60 శాతం వృద్ధి చెందడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీలోని 1,000 కంపెనీల షేర్ల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ.26 లక్షల కోట్ల పెరుగుదలతో మొత్తం రూ.66 లక్షల కోట్లకు చేరుకుంది. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో బుడగ ఏర్పడుతున్నదని సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు చాలా షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నెలలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీల్లోని షేర్లలో భారీగా అమ్మకాలు జరిగి, సూచీలు గణనీయంగా జారుకున్నాయి. అయినప్పటికీ, ఆర్థిక సంవత్సరం మొత్తానికి సూచీల్లో ఈ స్థాయి వృద్ధి నమోదు కావడం గమనార్హం. బీఎస్‌ఈలోని రంగాలవారీ సూచీలు సైతం ఈ ఏడాది భారీగా పెరిగాయి. రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ఆటో, ఎనర్జీ రంగాలు 135 శాతం నుంచి 70 శాతం వరకు వృద్ధి చెందాయి.

అంచనాలకు భిన్నంగా..

గత ఆర్థిక సంవత్సరం (2022-23)లాగే ఈసారీ మార్కెట్‌ పనితీరు అంతంత మాత్రంగానే ఉండవచ్చన్న అంచనాలకు భిన్నంగా సూచీలు బుల్‌ స్వారీ చేశాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పోటుతో పాటు అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం భయాలు, అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు తాత్కాలికంగా ప్రభావం చూపినప్పటికీ సెన్సెక్స్‌, నిఫ్టీ జోరును నిలువరించలేకపోయాయి. ‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్‌ బ్యాంక్‌ల వడ్డీ రేట్ల పెంపు, ముడిచమురు ధరల పెరుగుదల వంటి ప్రతికూలతల్లోనూ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగైన రిటర్నులు పంచాయి. ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్‌ ఇష్యూల (ఐపీఓ) జోరు పెరిగింది. ఎస్‌ఎంఈ సెగ్మెంట్లోనూ చాలా కంపెనీలు మార్కెట్లో లిస్టయ్యాయి. అంతేకాదు, ఈక్విటీల్లో రిటైల్‌ మదుపరుల పెట్టుబడులు గడిచిన కొన్నేళ్లలో భారీగా పుంజుకున్నాయ’’ని మాస్టర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అర్వింద్‌ సింగ్‌ నంద అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్‌ కేవలం 423 పాయింట్లు (0.72 శాతం) వృద్ధి చెందగా.. మార్కెట్‌ వర్గాల సంపద రూ.5.86 లక్షల కోట్ల మేర తరిగిపోయింది.

మార్కెట్‌ విలువపరంగా టాప్‌-5 కంపెనీలు

సంస్థ రూ.లక్షల కోట్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 20.14

టీసీఎస్‌ 14.05

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 11.00

ఐసీఐసీఐ బ్యాంక్‌ 7.69

భారతీ ఎయిర్‌టెల్‌ 6.99

Updated Date - Mar 29 , 2024 | 03:01 AM