ఐటీలో కొలువుల పండుగ
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:02 AM
ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థల స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చి వేయగల టెక్నాలజీలు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ సర్వీసుల విభాగంలో నియామకాలు జోరందుకోనున్నాయి. రాబోయే ఆరు నెలల...

వచ్చే 6 నెలల్లో 12 శాతం
వృద్ధి అంచనా
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థల స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చి వేయగల టెక్నాలజీలు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ సర్వీసుల విభాగంలో నియామకాలు జోరందుకోనున్నాయి. రాబోయే ఆరు నెలల కాలంలో ఐటీ రంగంలో నియామకాలు 10-12 శాతం పెరుగుతాయని క్వెస్ కార్ప్ తాజా నివేదికలో అంచనా వేసింది. ప్రధానంగా జెనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ విభాగాల్లో 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థ చెబుతోంది. జూన్ త్రైమాసికంతో పోల్చితే నిపుణుల డిమాండు గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల (జీసీసీ) విభాగంలో 71 శాతం, సైబర్ సెక్యూరిటీ విభాగంలో 58 శాతం పెరిగినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. క్వెస్ ఐటీ స్టాఫింగ్ డిజిటల్ నైపుణ్యాల నివేదిక ప్రకారం డెవల్పమెంట్, ఈఆర్పీ, టెస్టింగ్, నెట్వర్కింగ్, డేటా సైన్స్ సహా ఐదు విభాగాల్లో స్థూల డిమాండు 79 శాతం పెరిగిందని ఆ విభాగం సీఈఓ కపిల్ జోషి తెలిపారు.
నివేదిక ముఖ్యాంశాలు..
టెక్ ఉద్యోగాలకు జీసీసీలు ప్రధాన చోదక శక్తిగా ఉన్నాయి. ఏఐ/ఎంఎల్, అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్ ఆప్స్ విభాగాల్లో నిపుణుల డిమాండు అధికంగా ఉంది.
టెక్ విభాగంలో 62 శాతం ఉద్యోగ ప్రకటనలతో బెంగళూరు తిరుగులేని నాయకత్వ స్థానంలో ఉంది. హైదరాబాద్ (43.5 శాతం), పూణె (10 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జీసీసీల విస్తరణతో విభిన్న నగరాల్లో నిపుణులకు డిమాండు గణనీయంగా పెరుగుతోంది. ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ విభాగాల్లో నిపుణులను జీసీసీలు అధికంగా నియమించుకుంటున్నాయి.