ప్రత్యేక కంపెనీగా ఐటీసీ హోటల్స్
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:25 AM
ఐటీసీ హోటల్స్ను ప్రత్యేక లిస్టెడ్ కంపెనీగా వేరు చేసేందుకు ఐటీసీ వాటాదారులు ఆమోదం తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్/ఇతర ఆడియో విజువల్ పద్దతిలో జరిగిన...

విభజనకు ఐటీసీ వాటాదారుల ఆమోదం
న్యూఢిల్లీ: ఐటీసీ హోటల్స్ను ప్రత్యేక లిస్టెడ్ కంపెనీగా వేరు చేసేందుకు ఐటీసీ వాటాదారులు ఆమోదం తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్/ఇతర ఆడియో విజువల్ పద్దతిలో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన తీర్మానానికి 99.6 శాతం మంది వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐటీసీ హోటల్స్ను ప్రత్యేక లిస్టెడ్ కంపెనీగా వేరు చేయాలని గత ఏడాది జూలైలో ఐటీసీ బోర్డు నిర్ణయించింది. గురువారం నాటి వాటాదారుల ఆమోదంతో ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ తీర్మానంతో ఐటీసీ హోటల్స్ ఈక్విటీలో 40 శాతం ఐటీసీ వద్ద, మిగిలిన 60 శాతం వాటా మదుపరుల వద్ద ఉంటుంది. ఈ డీమెర్జర్ కింద ప్రతి 10 ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్స్ షేరు లభిస్తుందని సమాచారం.
6 లిస్టెడ్ కంపెనీలుగా వేదాంత
అనిల్ అగర్వాల్ నాయకత్వంలోని వేదాంత లిమిటెడ్ ఆరు లిస్టెడ్ కంపెనీలుగా మారనుంది. ఎస్బీఐతో సహా 52 శాతానికి పైగా రుణదాతలు ఇందుకు ఆమోదం తెలిపినట్టు కంపెనీ తెలిపింది. మరో వారం పది రోజుల్లో మిగిలిన రుణదాతలూ ఇందుకు ఆమోదం తెలుపుతారని కంపెనీ భావిస్తోంది. ఆ తర్వాత కంపెనీకి చెందిన అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, స్టీల్ అండ్ ఫెర్రస్ లోహాలు, బేస్ మెటల్స్ వ్యాపారాలను ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలుగా విభజిస్తారు. జింక్, కొత్తగా చేపట్టే వ్యాపారాలు మాత్రం వేదాంత లిమిటెడ్ పరిధిలోనే ఉంటాయి.