భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ భేష్
ABN , Publish Date - May 30 , 2024 | 02:17 AM
మరో రెండు మూడేళ్ల వరకు భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని ప్రముఖ అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ కితాబిచ్చింది. దీన్ని దృష్టిలో...
![భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ భేష్](https://media.andhrajyothy.com/media/2024/20240511/6_Business_b53f33f6f1.jpg)
స్థిరత్వం నుంచి సానుకూల స్థాయికి రేటింగ్ పెంపు
ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్
న్యూఢిల్లీ: మరో రెండు మూడేళ్ల వరకు భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని ప్రముఖ అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ కితాబిచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశ భవిష్యత్ ఆర్థిక పరిస్థితి అంచనాలను ‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూల’ స్థాయికి పెంచింది. 2014 తర్వాత ఎస్ అండ్ పీ ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం. అప్పట్లో ఎస్ అండ్ పీ భారత ఆర్థిక భవిష్యత్ను ప్రతికూల స్థాయి నుంచి స్థిరత్వానికి పెంచింది. ఆర్థిక భవిష్యత్ బాగుంటుందని చెప్పినా, భారత దీర్ఘకాలిక పరపతి రేటింగ్ను మాత్రం ఎస్ అండ్ పీ ఏమాత్రం పెంచలేదు. గతంలోలానే ‘బీబీబీ-’ స్థాయి వద్దే ఉంచింది. ఈ రేటింగ్ను పెట్టుబడులకు అత్యంత తక్కువ స్థాయిగా పరిగణిస్తారు.
సంస్కరణలు ఆగవు: జూన్ 4 తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, భారత్లో సంస్కరణలుగానీ, ద్రవ్య విధానాలుగానీ ఆగవని కూడా ఎస్ అండ్ పీ స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వం కూడా ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు మౌలిక సదుపాయలపైనా, ద్రవ్య లోటు కట్టడిపైనా దృష్టి పెట్టక తప్పదని అంచనా వేసింది. ప్రభుత్వ పెట్టుబడులు ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయని తెలిపింది.