Share News

అక్రమ రుణ యాప్‌ల పని పట్టాల్సిందే

ABN , Publish Date - Feb 22 , 2024 | 06:22 AM

అక్రమ ఆన్‌లైన్‌ రుణ యాప్‌ల దందాపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. వీటి భరతం పట్టేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)తో సహా...

అక్రమ రుణ యాప్‌ల పని పట్టాల్సిందే

మరిన్ని చర్యలు తీసుకోండి

రెగ్యులేటరీ సంస్థలకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ సూచన

న్యూఢిల్లీ : అక్రమ ఆన్‌లైన్‌ రుణ యాప్‌ల దందాపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. వీటి భరతం పట్టేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)తో సహా రెగ్యులేటరీ సంస్థలు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం నాడిక్కడ జరిగిన ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశంలో ఆమె ఈ విషయం చెప్పారు. అక్రమ రుణ యాప్‌ల మాయాజాలంతో వేల మంది మదుపరులు నష్టపోతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ఈ విషయం చెప్పడం విశేషం. దేశ ఆర్థిక స్థిరత్వానికి దేశ, విదేశాల నుంచి ఎదురయ్యే ముప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె రెగ్యులేటరీ సంస్థలను కోరారు. ఇందుకోసం నిరంతరం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై నిఘా పెట్టి, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీతారామన్‌ కోరారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, సెబీ చీఫ్‌తో సహా పలు రెగ్యులేటరీ సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జీడీపీ వృద్ధి రేటు మరింత పెరగాలి

2047 నాటికి మన దేశం 35 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే వచ్చే 30 సంవత్సరాలు మన జీడీపీ ఏటా 9-10 శాతం చొప్పున పెరగాలని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అన్నారు. బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ ఆర్థిక మాంద్యంలో ఉన్నందున భారత్‌ 2027 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమన్నారు.

జూన్‌ నుంచి వడ్డీ రేట్లు తగ్గొచ్చు : క్రిసిల్‌

జూన్‌ నుంచి ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించే అవకాశం ఉందని క్రిసిల్‌ అంచనా. గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ద్రవ్య లభ్యత లోటు రెట్టింపైందని తెలిపింది. ఈ లోటు భర్తీ చేసేందుకు ఆర్‌బీఐ వివిధ రూపాల్లో రూ.2.07 లక్షల కోట్లు మార్కెట్లో అందుబాటులోకి తెచ్చిందని తెలిపింది. నిధుల లభ్యత తగ్గడం వల్లే స్వల్ప కాలిక కాల్‌మనీ వడ్డీ రేట్లు 6.75 శాతానికి చేరాయని క్రిసిల్‌ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జూన్‌ నుంచి ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Feb 22 , 2024 | 06:22 AM