ఎయిర్టెల్లో జీక్యూజీ పెట్టుబడులు
ABN , Publish Date - Mar 08 , 2024 | 02:42 AM
హిండెన్బర్గ్ నివేదిక దెబ్బకు కుదేలైన సమయంలో అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి అనతి కాలంలోనే భారీగా లాభపడిన ప్రవాస భారతీయ ఇన్వెస్టర్, జీక్యూజీ పార్ట్నర్స్ చీఫ్ రాజీవ్ జైన్ తాజాగా...
0.8 శాతం వాటా
రూ.5,849 కోట్లకు కొనుగోలు
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ నివేదిక దెబ్బకు కుదేలైన సమయంలో అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి అనతి కాలంలోనే భారీగా లాభపడిన ప్రవాస భారతీయ ఇన్వెస్టర్, జీక్యూజీ పార్ట్నర్స్ చీఫ్ రాజీవ్ జైన్ తాజాగా మరో ప్రముఖ భారత కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్లో 0.8 శాతం వాటాను రూ.5,849 కోట్లకు దక్కించుకున్నారు. ఎయిర్టెల్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ సింగపూర్ టెలీకమ్యూనికేషన్స్ (సింగ్టెల్) నుంచి జీక్యూజీ ఈ వాటాను చేజిక్కించుకుంది. ఓపెన్ మార్కెట్లో బ్లాక్ డీల్స్ ద్వారా ఈ షేర్ల కొనుగోలు లావాదేవీ జరిగింది. 0.8 శాతం వాటాకు సమానమైన 4.9 కోట్ల షేర్లను సగటున ఒక్కొక్కటీ రూ.1,193.70 చొప్పున జీక్యూజీ కొనుగోలు చేసింది. ఈ డీల్ తర్వాత ఎయిర్టెల్లో సింగ్టెల్ వాటా 29.8 శాతం నుంచి 29 శాతానికి తగ్గింది. భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం, సింగ్టెల్.. భారతీ టెలికాం లిమిటెడ్ సహ-ఇన్వెస్టర్లుగా ఉన్నారు.