వస్తు సేవల పన్ను - బడ్జెట్ ప్రతిపాదనలు
ABN , Publish Date - Jul 28 , 2024 | 02:11 AM
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వస్తు సేవల పన్ను చట్టానికి పలు సవరణలు ప్రతిపాదించారు. వీటిలో పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన కొన్ని ముఖ్య ప్రతిపాదనలు మీ కోసం...

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వస్తు సేవల పన్ను చట్టానికి పలు సవరణలు ప్రతిపాదించారు. వీటిలో పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన కొన్ని ముఖ్య ప్రతిపాదనలు మీ కోసం...
మొదటిది ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ గడువుకు సంబంధించినది. ఒక వ్యాపారి తాను పొందిన వస్తు సేవలకు సంబంధించిన క్రెడిట్ను నిర్ణీత గడువు లోపు తీసుకోవాలి. నిజానికి ఈ నిర్ణీత గడువుకు సంబంధించిన నిబంధనకు ఇంతకు ముందు కూడా సవరణ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధన ప్రకారం ఇన్వాయి్స ఏ ఆర్థిక సంవత్సరంలో పొందారో దాని తదుపరి ఆర్థిక సంవత్సరం నవంబరు 30 లోపు ఆ ఇన్వాయి్సకు సంబంధించిన ఐటీసీని రిటర్న్ దాఖలు చేయడం ద్వారా పొందాలి. అయితే జీఎ్సటీ ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో చాలా మంది అవగాహన లేకపోవడం వల్ల అర్హత ఉన్నప్పటికీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ను నిర్ణీత గడువు లోగా పొందలేకపోయారు. అందుకే ఆ గడువు ముగిసిన తర్వాత తీసుకున్న ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లదంటూ పన్ను చెల్లింపుదారులకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది.
ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత నిబంధనను ఈ బడ్జెట్లో సవరించారు. దీని ప్రకారం 2017-18 నుంచి 2020-21 సంవత్సరం వరకు అంటే మొదటి నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో పొందిన ఇన్వాయి్సలపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ను 2021 నవంబరు 30 లోపు ఎప్పుడు తీసుకున్నా దానిని నిర్ణీత గడువు లోగా తీసుకున్నట్టుగానే పరిగణిస్తారు.
ఇక రెండోది కూడా ఐటీసీకి సంబంధించినదే. ఒక వ్యక్తి రిజిస్ర్టేషన్ రద్దయి తిరిగి పునరుద్ధరణ జరిగినప్పుడు రిజిస్ర్టేషన్ రద్దు నాటికి ఉన్న ఇన్వాయి్సలపై తీసుకోకుండా మిగిలిపోయిన క్రెడిట్ ఏదైనా ఉంటే అలాంటి క్రెడిట్ను పునరుద్ధరణ అయిన తర్వాత కూడా పొందవచ్చు. అయి తే రిజిస్ర్టేషన్ అమలులో ఉన్న సమయంలో సదరు క్రెడిట్ పొందడానికి గల నిర్ణీత గడువు మించి ఉండకూడదు. అంటే రిజిస్ర్టేషన్ పునరుద్ధరణ జరిగే సమయానికి సదరు ఇన్వాయి్సల మీద క్రెడిట్ పొందడానికి గల నిర్ణీత గడువు దాటినప్పటికీ క్రెడిట్ పొందవచ్చు. అయితే దీనికి కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయి.
మరో ముఖ్యమైన సవరణ కూడా ఉంది. మోసపూరిత ఉల్లంఘనలు కాకుండా సాధారణ ఉల్లంఘనలు చోటు చేసుకున్న సమయంలో పన్ను చెల్లింపునకు సంబంధించి ఒక వ్యక్తికి నోటీసు లేదా ఆర్డర్ అందినప్పుడు సదరు వ్యక్తి ఆ పన్ను మొత్తాన్ని నిర్ణీత గడువు లోపు చెల్లించినప్పుడు దానికి సంబంధించిన వడ్డీ, పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే సంబంధిత నోటీసు లేదా ఆర్డర్లో పన్నుతో పాటు వడ్డీ, పెనాల్టీ ఉన్నప్పటికీ పన్ను మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఎంతో మందికి ఊరట కలిగించే అంశం. అయితే ఈ మినహాయింపు 2017 జూలై నుంచి 2020 మార్చి మధ్యలో వచ్చిన డిమాండ్లకు మాత్రమే వర్తిస్తుంది.
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
రాంబాబు గొండాల