హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి గోద్రెజ్ ప్రాపర్టీస్
ABN , Publish Date - Feb 15 , 2024 | 06:02 AM
ప్రముఖ రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం రాజేంద్రనగర్ ప్రాంతంలో 12.5 ఎకరాలు కొనుగోలు చేసింది...
![హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి గోద్రెజ్ ప్రాపర్టీస్](https://media.andhrajyothy.com/media/2023/20231205/8_Business_2a072e2ef7.jpg)
రూ.350 కోట్లతో 12.5 ఎకరాల కొనుగోలు
ప్రీమియం, లగ్జరీ నివాస గృహ ప్రాజెక్ట్ అభివృద్ధి
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం రాజేంద్రనగర్ ప్రాంతంలో 12.5 ఎకరాలు కొనుగోలు చేసింది. ఈ భూమిని ఎంతకు కొన్నదీ కంపెనీ వెల్లడించలేదు. అయుతే ఈ లావాదేవీ విలువ రూ.350 కోట్ల వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ వెంచర్ ద్వారా ప్రీమియం, లగ్జరీ నివాస గృహాలు నిర్మించాలని కంపెనీ భావిస్తోంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.
రూ.3,500 కోట్ల ఆదాయం: ఈ ప్రీమియం, లగ్జరీ నివాస గృహాల ప్రాజెక్టు ద్వారా రూ.3,500 కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉందని గోద్రెజ్ ప్రాపర్టీస్ అంచనా. ఈ వెంచర్ ద్వారా 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం, లగ్జరీ అపార్ట్మెంట్లు నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. మున్ముందు కూడా హైదరాబాద్ తమకు కీలక మార్కెట్ కానుందని కంపెనీ తెలిపింది. దేశంలోని కీలక నగరాల్లో మా ఉనికిని బలోపేతం చేయాలనుకుంటున్నామని, ఆ వ్యూహంలో భాగంగానే హైదరాబాద్లో ఈ భూమి కొనుగోలు చేసినట్లు గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈఓ గౌరవ్ పాండే తెలిపారు.