Share News

Fastag: వాహనదారులకు తీపి వార్త.. ఫాస్టాగ్ కేవైసీపై అదిరిపోయే అప్‌డేట్

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:48 PM

వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ చెప్పనుందా. పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాస్టాగ్ కేవైసీ (KYC) అప్‌డేట్ గడువును ఎన్‌హెచ్ఏఐ పెంచబోతోంది. గతంలో ఫిబ్రవరి 29ని చివరి తేదీగా ప్రకటించగా.. వాహనదారుల వినతుల మేరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Fastag: వాహనదారులకు తీపి వార్త.. ఫాస్టాగ్ కేవైసీపై అదిరిపోయే అప్‌డేట్

ఢిల్లీ: వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ చెప్పనుందా. పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాస్టాగ్ కేవైసీ (KYC) అప్‌డేట్ గడువును ఎన్‌హెచ్ఏఐ పెంచబోతోంది. గతంలో ఫిబ్రవరి 29ని చివరి తేదీగా ప్రకటించగా.. వాహనదారుల వినతుల మేరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫాస్టాగ్‌లు వాహనదారులకు కీలకంగా మారాయి. రోడ్డు ప్రయాణాల్లో టోల్ గేటుల వద్ద ఎక్కువ సేపు ఆగకుండా టోల్ చెల్లించే సమయాన్ని ఫాస్టాగ్‌లు తగ్గించాయి.

వాహనదారులకు మరింత సౌలభ్యం కోసం జాతీయ రహదారుల సంస్థ కేవైసీ నిబంధనలు తీసుకొచ్చింది. ఫాస్టాగ్ కస్టమర్లు ఫిబ్రవరి 29లోపు కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది. ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయకపోతే వారి ఫాస్టాగ్‌లు డీయాక్టివేట్ అవుతాయని తేల్చి చెప్పింది. ఇవాళ్టితో గడువు ముగియడంతో మరికొన్ని రోజులు కేవైసీ అప్‌డేట్ గడువును పెంచాలని నిర్ణయించింది.


పేటీఎం సంక్షోభంతో వేల సంఖ్యలో వాహనదారులు ఫాస్టాగ్ ఖాతాల వివరాలు మార్చుకుంటున్నారు. వినియోగదారుల వినతులతో గడువు పెంచాలని నిర్ణయించుకున్నట్లు ఎన్‌హెచ్ఏఐ అధికారి ఒకరు తెలిపారు. గడువును మార్చి చివరి వరకు పొడగించే అవకాశం ఉంది.

అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అనేక బ్యాంకులు, వాలెట్ సేవలు, పేటీఎం తదితర ప్లాట్‌ఫారమ్‌లపై ఫాస్ట్‌ట్యాగ్‌ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇవి వినియోగదారుల బ్యాంక్ ఖాతాలకు లింక్ అయి ఉంటాయి. ఆర్బీఐ (RBI) జనవరి 31న పేటీఎంపై నిషేధం విధించిన విషయం విదితమే. ఫిబ్రవరి 29 నుండి కొత్త కస్టమర్‌లను అనుమతించడం ఆపేయాలని Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని ఆర్బీఐ ఆదేశించింది.

Updated Date - Feb 29 , 2024 | 05:56 PM