Share News

క్వాలిటీ కేర్‌ గ్రూప్‌ చైర్మన్‌గా డాక్టర్‌ హరిప్రసాద్‌

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:27 AM

భారత్‌, బంగ్లాదేశ్‌ల్లో కేర్‌ హాస్పిటల్స్‌, కిమ్స్‌ హెల్త్‌, ఎవర్‌కేర్‌ పేరుతో వైద్య సేవలు అందిస్తున్న క్వాలిటీ కేర్‌ గ్రూప్‌ చైర్మన్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ హరిప్రసాద్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వరుణ్‌ ఖన్నా...

క్వాలిటీ కేర్‌ గ్రూప్‌ చైర్మన్‌గా డాక్టర్‌ హరిప్రసాద్‌

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): భారత్‌, బంగ్లాదేశ్‌ల్లో కేర్‌ హాస్పిటల్స్‌, కిమ్స్‌ హెల్త్‌, ఎవర్‌కేర్‌ పేరుతో వైద్య సేవలు అందిస్తున్న క్వాలిటీ కేర్‌ గ్రూప్‌ చైర్మన్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ హరిప్రసాద్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వరుణ్‌ ఖన్నా నియమితులయ్యారు. వైద్య సేవల రంగం లో 30 ఏళ్లకు పైగా అపార అనుభవం ఉన్న హరి ప్రసాద్‌ నేతృత్వంలో గ్రూప్‌ మరింత బలోపేతం కానుందని క్వాలిటీ కేర్‌ వెల్లడించింది. హరి ప్రసాద్‌ ఇటీవలి వరకు అపోలో గ్రూప్‌ హాస్పిటల్స్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఈయన హయాంలోనే అపోలో గ్రూప్‌ హాస్పిటల్స్‌ పడకల సంఖ్య 1,200 నుంచి 10,000 స్థాయికి చేరుకుంది. అంతేకాకుండా హైదరాబాద్‌లో అపోలో హెల్త్‌ సిటీ ఏర్పాటు లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆసియాలో మొదటి ఆపరేషనల్‌ హెల్త్‌ సిటీ ఇదే. అలాగే సొసైటీ ఫర్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఇండియాకు కూడా హరిప్రసాద్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పని చేశారు. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌, బ్రిటన్‌కు చెందిన రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ హరిప్రసాద్‌ను ఫెలోషి్‌పతో సత్కరించాయి. వీటికి తోడు ఆస్ట్రేలియాకు చెందిన మక్వేరీ యూనివర్సిటీ తన గ్లోబల్‌ ఎండీ ప్రోగ్రామ్‌కు హరి ప్రసాద్‌ను క్యాంపస్‌ డీన్‌గా నియమించింది.

ఈ సందర్భంగా హరి ప్రసాద్‌ మాట్లాడుతూ.. భారత్‌ సహా దక్షిణాసియాలోని వెనుకబడిన నగరాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించే గ్రూప్‌ బాధ్యతలను తాను స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మెరుగైన క్లినికల్‌ ఫలితాలతో క్వాలిటీ కేర్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, నాణ్యతను పెంపొందించడానికి క్లినికల్‌, మేనేజ్‌మెంట్‌ టీమ్‌తో కలిసి పని చేయడానికి సంతోషిస్తున్నట్లు హరి ప్రసాద్‌ చెప్పారు. కాగా ఎండీగా నియమితులైన వరుణ్‌ ఖన్నాకు హెల్త్‌కేర్‌ రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

Updated Date - Apr 05 , 2024 | 02:27 AM