అపార్ట్మెంట్ రెసిడెన్స్ సంఘాలు జీఎ్సటీ చెల్లించాలా?
ABN , Publish Date - Jan 14 , 2024 | 03:01 AM
ఒకప్పుడు అపార్ట్మెంట్ అంటే నాలుగైదు అంతస్తులకు మాత్రమే పరిమితమై ఉండేవి. వీటిలో కనీస అవసరాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ప్రజల జీవన శైలి మారటం, అభిరుచుల్లో మార్పులతో పాటు బ్యాంకింగ్ సేవలు...
![అపార్ట్మెంట్ రెసిడెన్స్ సంఘాలు జీఎ్సటీ చెల్లించాలా?](https://media.andhrajyothy.com/media/2023/20231205/2_Business_4c1abe20a3.jpg)
ఒకప్పుడు అపార్ట్మెంట్ అంటే నాలుగైదు అంతస్తులకు మాత్రమే పరిమితమై ఉండేవి. వీటిలో కనీస అవసరాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ప్రజల జీవన శైలి మారటం, అభిరుచుల్లో మార్పులతో పాటు బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి రావటంతో వివిధ సదుపాయాలు ఉండే బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. వీటిలో సకల సౌకర్యాలు ఉండటంతో చాలా మంది వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బిల్డర్ తాను అపార్ట్మెంట్ కట్టే సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించినా ఆ తర్వాత వాటిని మెయింటెయిన్ చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అపార్ట్మెంట్లో నివసించే వారు ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీన్ని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లేదా సొసైటీగా వ్యవహరిస్తారు.
ఈ అసోసియేషన్ పని ఏమిటంటే అపార్ట్మెంట్కు సంబంధించిన అన్ని పనులు అంటే.. సెక్యూరిటీ, లిఫ్ట్, కామన్ ఏరియా, పార్క్లు, ఆట స్థలాలు మొదలైన వాటిని చూసుకుంటుంది. దీనిలో అపార్ట్మెంట్లోని అందరూ.. సభ్యులుగా వ్యవహరిస్తారు. నెలవారీ ఖర్చుల కోసం ప్రతి సభ్యుడి నుంచి కొంత మొత్తం మెయింటెనెన్స్ చార్జీల కింద వసూలు చేస్తారు. మరి ఇలా వసూలు చేసే మెయింటెనెన్స్ చార్జీల మీద ఆయా సంక్షేమ సంఘాలు జీఎ్సటీ చెల్లించాలా? చెల్లించాల్సి వస్తే దాని విధివిధానాలు ఏమిటి? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
ముందుగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ జీఎ్సటీ చెల్లించాలా అంటే.. కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. తమ సభ్యుల ద్వారా వసూలు చేసే మొత్తం.. సంవత్సరానికి రూ.20 లక్షలు దాటనంత వరకు ఆయా సంక్షేమ సంఘాలకు జీఎ్సటీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒకవేళ ఆ మొత్తం రూ.20 లక్షలు దాటితే రిజిస్ట్రేషన్ తప్పకుండా తీసుకోవాలి. ఇంకా సభ్యుడి నుంచి వసూలు చేసే నెలవారీ మెయింటెనెన్స్ చార్జీ నెలకు రూ.7,500 మించకపోతే ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్లో మూడు బెడ్రూముల ఫ్లాట్కు మెయింటెనెన్స్ చార్జీ నెలకు రూ.8,000, రెండు బెడ్ రూముల ఫ్లాట్కు రూ.7,000 అనుకుందాం. అప్పుడు మూడు బెడ్రూముల ఫ్లాట్కు సంబంధించిన మెయింటెనెన్స్ చార్జీల మీద అంటే రూ.8,000 మీద మాత్రమే జీఎ్సటీ కడితే సరిపోతుంది. అయితే ఇక్కడా ఒక సందేహం రావచ్చు. రూ.7,500 వరకు పన్ను మినహాయింపు ఉంది కాబట్టి.. అది పోను మిగతా మొత్తం మీద అంటే రూ.500 మీద జీఎ్సటీ కడితే సరిపోతుందా అని. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక వివరణ ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం ఒక నెల మెయింటెనెన్స్ చార్జీ రూ.7,500 దాటినట్లయితే.. మొత్తం చార్జీ మీద జీఎ్సటీ కట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణలో రూ.500 మీద కాకుండా మొత్తం రూ.8,000 మీద జీఎ్సటీ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఒక అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉంటే జీఎ్సటీ కోసం మెయింటెనెన్స్ చార్జీ మొత్తంగా కలిపి చూడాలా లేదా విడివిడిగా చూడాలా అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. పైన చెప్పిన ఉదాహరణలో ఒకే వ్యక్తికి ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నాయనుకుందాం. రెండింటి మీద కలిపి రూ.15,000 మెయింటెనెన్స్ చార్జీ కట్టాల్సి వస్తుంది. ఈ మొత్తం పన్ను మినహాయింపు పరిమితి రూ.7,500కి మించి ఉంది కాబట్టి మొత్తం మీద జీఎ్సటీ కట్టాల్సి ఉంటుందా? దీనికి కూడా ఒక వివరణ ఇవ్వటం జరిగింది. ఒక వ్యక్తికి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నప్పటికీ ఏ ఫ్లాట్కు అయితే మెయింటెనెన్స్ చార్జీ రూ.7,500 దాటుతుందో దాని మీద మాత్రమే జీఎ్సటీ కట్టాల్సి ఉంటుంది. కొన్ని అపార్ట్మెంట్స్లో తక్కువ సంఖ్యలో ఫ్లాట్స్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ చార్జీ రూ.7,500 దాటినప్పటికీ. వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు దాటకపోవచ్చు. అలాంటప్పుడు కూడా ఆయా అసోసియేషన్స్కు జీఎ్సటీ కింద రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ వెల్ఫేర్ సొసైటీ తాము పొందిన వస్తు సేవల మీద జీఎ్సటీ నియమ నిబంధనల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.