ఎగుమతుల్లో క్షీణత
ABN , Publish Date - Apr 16 , 2024 | 02:51 AM
భారత వస్తు సేవల ఎగుమతులు మార్చి నెలలో 4,168 కోట్ల డాలర్లకు దిగి వచ్చాయి. కాగా మార్చి 31వ తేదీతో ముగిసిన అర్థిక సంవత్సరంలో ఎగుమతులు 3.11% దిగజారి 43,706 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి...
![ఎగుమతుల్లో క్షీణత](https://media.andhrajyothy.com/media/2024/20240413/1_Business_02d7055b10.jpg)
న్యూఢిల్లీ: భారత వస్తు సేవల ఎగుమతులు మార్చి నెలలో 4,168 కోట్ల డాలర్లకు దిగి వచ్చాయి. కాగా మార్చి 31వ తేదీతో ముగిసిన అర్థిక సంవత్సరంలో ఎగుమతులు 3.11% దిగజారి 43,706 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా భౌగోళిక, రాజకీయ సంఘటనలు ఎగుమతులపై ప్రభావం చూపాయి. దిగుమతులు కూడా మార్చి నెలలో 5.98ు తగ్గి 5,728 కోట్ల డాలర్లకు దిగజారగా ఏడాది మొత్తం మీద 5.41% క్షీణించి 67,724 కోట్ల డాలర్లకు దిగజారాయి. మార్చిలో వాణిజ్య లోటు 156 కోట్ల డాలర్లుగా నమోదు కాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 24,017 కోట్ల డాలర్లకు చేరింది. తాము విదేశీ వాణిజ్యం తాజా పరిస్థితిని పరిశీలిస్తున్నామని, అవసరమైన సమయంలో తగు చర్య తీసుకుంటామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భర్త్వాల్ అన్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందు వల్ల మరింత వివరణ ఇవ్వలేకపోతున్నామని తెలిపింది. ప్రధానంగా ఎలక్ర్టానిక్ వస్తువులు; ఔషధాలు, ఫార్మాస్యూటికల్స్; ఇంజనీరింగ్ వస్తువులు, ఇనుప ఖనిజం, కాటన్ యార్న్, చేనేత ఉత్పత్తులు, సిరామిక్, గ్లాస్వేర్ ఉత్పత్తులు ఎగుమతుల రంగానికి మద్దతు ఇచ్చాయి.