అనుమానాస్పద లావాదేవీల ‘పర్యవేక్షణ’పై జర జాగ్రత్త : సెబీ
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:27 AM
స్టాక్ మార్కెట్లో రిటైల్ మదుపరుల ప్రయోజనాల కోసం మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక చర్య తీసుకుంది. అసాధారణ లేదా అనుమానాస్పద లావాదేవీలను...

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో రిటైల్ మదుపరుల ప్రయోజనాల కోసం మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక చర్య తీసుకుంది. అసాధారణ లేదా అనుమానాస్పద లావాదేవీలను వెంటనే పసిగట్టడం, పర్యవేక్షించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీల వంటి మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థల (ఎంఐఐ)ను కోరింది. ఈ విషయంలో ఏ మాత్రం విఫలమైనా భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. ఈ జరిమానాలు ఆయా సంస్థల వార్షిక ఆదాయం ఆధారంగా నిర్ణయిస్తామని తెలిపింది. వచ్చే నెల 1 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.
కేఆర్ఏలకూ కొత్త నిబంధనలు: నో యువర్ కస్టమర్ (కేవైసీ) వ్యవస్థను సెబీ మరింత పటిష్ఠం చేస్తోంది. ఇందుకోసం ఈ పని చేసే కేవైసీ రిజిస్ట్రేషస్ సంస్థలు (కేఆర్ఏ)లు తమ వ్యవస్థలను సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ (సీకేవైసీఆర్ఆర్)తో అనుసంధానం చేసుకోవాలని కోరింది. ఖాతాదారులకు సంబంధించిన అన్ని విషయాలు నిర్ధారించుకున్న తరువాతే కేవైసీ వివరాలు నమోదు చేసే సంస్థలు ఆ వివరాలను కేఆర్ఏలు, సీకేవైసీఆర్ఆర్ల వెబ్సైట్లలోకి అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది.