‘క్రిప్టో’ల వేలంవెర్రిని భరించలేం
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:46 AM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి క్రిప్టో కరెన్సీలపై తన వ్యతిరేకతను వెల్లడించారు. వర్థమాన దేశాలు గానీ, సంపన్న దేశాలు గానీ ‘క్రిప్టో’ కరెన్సీల వేలంవెర్రిని భరించలేవన్నారు...

ఈ విషయంలో మా దారి మాదే
ఆర్బీఐ గవర్నర్ దాస్
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి క్రిప్టో కరెన్సీలపై తన వ్యతిరేకతను వెల్లడించారు. వర్థమాన దేశాలు గానీ, సంపన్న దేశాలు గానీ ‘క్రిప్టో’ కరెన్సీల వేలంవెర్రిని భరించలేవన్నారు. మింట్ పత్రి క నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము ఏ దేశ రెగ్యులేటరీ సంస్థలను అనుసరించలేమని స్పష్టం చేశారు. అమెరికా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ’(ఎస్ఈసీ) క్రిప్టో కరెన్సీల ఈటీఎ్ఫలను అనుమతించిన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ దాస్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘ఒకరికి మంచిదైంది మరొకరికి మంచిది కాకపోవచ్చు. ఈ విషయంలో నా అభిప్రాయం, ఆర్బీఐ అభిప్రాయం గతంలోలానే ఉంది’ అన్నారు.
అదుపు చేయడమూ కష్టమే: క్రిప్టో కరెన్సీలను ప్రోత్సహించే వర్థమాన, సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద ముప్పు పొంచి ఉందని శక్తికాంత దాస్ హెచ్చరించారు. ఈ ముప్పును అదుపు చేయడం కూడా కష్టమని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల ఈటీఎ్ఫలను అనుమతిస్తూనే.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అమెరికా ఎస్ఈసీ హెచ్చరించిన విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ ద్రవ్యోల్బణాన్ని పెంచే విధంగా ఉండకపోవచ్చన్నారు.
యూపీఐ ప్రపంచంలోనే మేటి: డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఎన్పీసీఐ అభివృద్ధి చేసిన యూపీఐ యాప్.. అత్యుత్తమ చెల్లింపుల యాప్ అని దాస్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్పీసీఐ గుత్తాధిపత్యం వహిస్తోందన్న విమర్శలను ఆయన కొట్టివేశారు. యూపీఐ యాప్ మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. చెల్లింపులకు సంబంధించి యూపీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ యాప్ అన్నారు.సింగపూర్, యూఏఈ వంటి దేశాలు కూడా తమ డిజిటల్ చెల్లింపుల కోసం ఈ యాప్ను వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఈ యాప్ ద్వారా జరిగే నెలవారీ లావాదేవీలు ఎపుడో 10,000 కోట్లు దాటిపోయాయన్నారు.