బీపీసీఎల్ ప్రైవేటీకరణకు పుల్స్టాప్
ABN , Publish Date - Jun 12 , 2024 | 02:02 AM
ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణను మోదీ సర్కార్ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. వరుసగా రెండోసారి కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖా మంత్రి గా...
![బీపీసీఎల్ ప్రైవేటీకరణకు పుల్స్టాప్](https://media.andhrajyothy.com/media/2024/20240604/1_Business_c8e2e2530b.jpg)
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణను మోదీ సర్కార్ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. వరుసగా రెండోసారి కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖా మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన హర్దీప్ సింగ్ పురి ఈ విషయం వెల్లడించారు. అధిక ఆదాయం, మంచి లాభా ల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు వేటినీ ప్రైవేటీకరించే యోచన లేదన్నారు. ఎన్డీఏ 2.0 హయాంలో బీపీసీఎల్ ఈక్విటీలో ప్రభుత్వానికి ఉన్న 52.9 శాతం వాటాను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే మోదీ సర్కార్ ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టు భావిస్తున్నారు. కాగా కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లోని కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 బ్లాక్ నుంచి త్వరలో రోజువారీ చమురు ఉత్పత్తి 45,000 బ్యారళ్లకు చేరుతుందని పురి చెప్పారు. ఈ ప్రాంతంలో త్వరలో గ్యాస్ ఉత్పత్తి కూడా ప్రారంభం కానుందన్నారు. దిగుమతుల భారం తగ్గించేందుకు, దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంచేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. చెన్నైలో ఐఓసీ కొత్తగా నిర్మిస్తున్న రిఫైనరీకి చేరువలో బీపీసీఎల్ కూడా త్వరలో కొత్త రిఫైనరీ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.