Share News

భారత్‌లోనే విద్యుత్‌ కార్ల అసెంబ్లింగ్‌

ABN , Publish Date - Mar 20 , 2024 | 05:23 AM

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత్‌లో విక్రయించే విద్యుత్‌ కార్లను దేశీయంగానే అసెంబ్లింగ్‌ చేసే ప్రయత్నంలో ఉంది.దీనివల్ల కస్టమర్లకు అందుబాటులో ఉండే...

భారత్‌లోనే విద్యుత్‌ కార్ల అసెంబ్లింగ్‌

ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ థిల్లాన్‌

ఇంగోల్‌స్టాట్‌ (జర్మనీ): జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత్‌లో విక్రయించే విద్యుత్‌ కార్లను దేశీయంగానే అసెంబ్లింగ్‌ చేసే ప్రయత్నంలో ఉంది.దీనివల్ల కస్టమర్లకు అందుబాటులో ఉండే వివిధ ధరల శ్రేణుల్లో కార్లను అందుబాటులోకి తెచ్చి కస్టమర్‌ బేస్‌ పెంచుకునే వీలు కలుగుతుందని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ థిల్లాన్‌ అన్నారు. ఆడి కంపెనీ కొత్త ఎలక్ట్రిక్‌ కారు క్యూ6 ఈ-ట్రాన్‌ను ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ ఏడాదిలోనే ఈ కారు ప్రపంచ మార్కెట్లలో ప్రవేశించనుంది. వచ్చే ఏడాది భారత మార్కెట్లో కూడా విక్రయాలు ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా ధిల్లాన్‌ మాట్లాడుతూ.. ఈ మోడల్‌లో విద్యుత్‌ వాహనాల రంగంలో తమ అస్తిత్వం మరింత పెరుగుతుందని అన్నారు. 2030 నాటికి తమ అమ్మకాల్లో 50 శాతం విద్యుత్‌ కార్లే ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కారు ఒకసారి చార్జి చేస్తే 625 కిలోమీటర్లు నడుస్తుంది. ప్రస్తుతం విద్యుత్‌ కార్లన్నీ సీబీయూలుగా దిగుమతి చేసుకుని ఔరంగాబాద్‌ ప్లాంట్‌లో అసెంబ్లింగ్‌ చేస్తోంది. దీని వల్ల 60 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్‌ సుంకాలు భరించాల్సి వస్తోంది. స్థానికంగానే ఉత్పత్తి చేయడం వల్ల ఆ భారం తగ్గి కస్టమర్లకు మరింత తక్కువ ధరకు కార్లు అందించగలుగుతామని థిల్లాన్‌ అన్నారు.

2025 నాటికి 20 కొత్త మోడల్స్‌: వచ్చే ఏడాది చివరికి తాము ప్రపంచ మార్కెట్లో 20 కొత్త మోడల్స్‌ ప్రవేశపెట్టాలనుకుంటున్నట్టు ఆడి ఏజీ సీఈఓ గెర్నాట్‌ డోల్నర్‌ చెప్పారు. వివిధ రకాల కార్ల అభివృద్ధి కార్యకలాపాలపై తాము 2024-28 మధ్య కాలంలో 4100 యూరోలు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. గత ఏడాది తమ విద్యుత్‌ కార్ల డెలివరీలు 50 శాతం పెరిగినట్టు ఆయన చెప్పారు. 2023 సంవత్సరంలో ఆడి కంపెనీ 1.78 లక్షల విద్యుత్‌ కార్లు విక్రయించింది. ముందు ఏడాదితో పోల్చితే ఇది 51 శాతం అధికం.

Updated Date - Mar 20 , 2024 | 05:23 AM