Share News

దేశీయ రియల్టీ రంగంలో 55% తగ్గిన సంస్థాగత పెట్టుబడులు

ABN , Publish Date - Apr 14 , 2024 | 02:45 AM

ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి సంస్థాగత పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 55 శాతం తగ్గి 55.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. అందులో విదేశీ సంస్థాగత పెట్టుబడులు...

దేశీయ రియల్టీ రంగంలో 55% తగ్గిన సంస్థాగత పెట్టుబడులు

  • జనవరి- మార్చి త్రైమాసికంలో 55.2 కోట్ల డాలర్లకు పరిమితం

  • విదేశీ సంస్థాగత పెట్టుబడుల్లో 99% క్షీణత

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి సంస్థాగత పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 55 శాతం తగ్గి 55.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. అందులో విదేశీ సంస్థాగత పెట్టుబడులు 99 శాతం క్షీణించి 1.1 కోట్ల డాలర్లకు పడిపోగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు మాత్రం 21 శాతం పెరుగుదలతో 54.1 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సేవల సంస్థ వెస్టియన్‌ తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో ఈ రంగంలోకి దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల మొత్తం పెట్టుబడులు 123 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడుల విషయంలో అప్రమత్త ధోరణితో వ్యవహరించారని వెస్టియన్‌ సీఈఓ శ్రీనివాస్‌ రావు అన్నారు.

దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం భారత ఆర్థికాభివృద్ధి అవకాశాలపై అత్యంత ఆశావహంగా ఉన్నారని, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులను కొనసాగించారన్నారు. గడిచిన మూడు నెలలకు నమోదైన సంస్థాగత పెట్టుబడుల్లో అత్యధికంగా 23.16 కోట్ల డాలర్లు కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ (ఆఫీస్‌, రిటైల్‌, కో-వర్కింగ్‌, హాస్పిటాలిటీ ప్రాజెక్టులు)లోకి వచ్చాయని వెస్టియన్‌ రిపోర్టు వెల్లడించింది. కాగా, రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుల్లోకి 22.5 కోట్ల డాలర్ల పెట్టుబడులొచ్చాయి. పారిశ్రామిక, గిడ్డంగుల రంగంలోకి పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 73 శాతం తగ్గి 5.89 కోట్ల డాలర్లకు పడిపోయాయి.

నగరాలవారీగా చూస్తే, బెంగళూరు అత్యధికంగా 29.9 కోట్ల డాలర్ల సంస్థాగత ఇన్వె్‌స్టమెంట్లను ఆకర్షించింది. 11 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ మార్కెట్‌ ఆ తర్వాత స్థానంలో నిలిచింది. మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 74 శాతం ఈ రెండు నగరాల్లోకే తరలిరావడం గమనార్హం. కాగా, ఎడెల్‌వీజ్‌ క్యాపిటల్‌ అత్యధికంగా 30 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక మూలాలు మరింత బలపడటంతో పాటు గిరాకీ పుంజుకున్న నేపథ్యంలో మున్ముందు నెలల్లో ఈ రంగంలోకి సంస్థాగత పెట్టుబడులు మళ్లీ జోరందుకోవచ్చని శ్రీనివాస్‌ రావు అభిప్రాయపడ్డారు.

Updated Date - Apr 14 , 2024 | 02:45 AM