Share News

పదేళ్లలో రూ.5.3 లక్షల కోట్లు హాంఫట్‌

ABN , Publish Date - Mar 28 , 2024 | 02:09 AM

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బ్యాంకు మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. గత పదేళ్లలో (2013-2023) దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 4,62,733 మోసాలు చోటు చేసుకున్నాయి. ఈ మోసాలతో బ్యాంకులు...

పదేళ్లలో రూ.5.3 లక్షల కోట్లు హాంఫట్‌

బ్యాంకులను దోచేస్తున్న కేటుగాళ్లు

మోసాల్లో 8వ స్థానంలో తెలంగాణ

ముంబై: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బ్యాంకు మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. గత పదేళ్లలో (2013-2023) దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 4,62,733 మోసాలు చోటు చేసుకున్నాయి. ఈ మోసాలతో బ్యాంకులు, ఖాతాదారులు రూ.5.3 లక్షల కోట్లు నష్టపోయా రు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ వివరాలు వెల్లడించింది. అడ్వాన్స్‌లు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, డిజిటల్‌ లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.

అగ్రస్థానంలో మహారాష్ట్ర: బ్యాంకింగ్‌ మోసాల్లో ఎక్కువ భాగం మహారాష్ట్రలో నమోదవుతున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. 2013-2023 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో 1.59 లక్షల బ్యాంకింగ్‌ మోసాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకులు రూ.2.24 లక్షల కోట్లు నష్ట పోయా యి. ఎన్‌సీఆర్‌ ఢిల్లీ (56,560 కేసులు), హరియాణా (57,767), తమిళనాడు (38,792), ఉత్తర ప్రదేశ్‌ (30,135) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కర్ణాటక, గుజరాత్‌, తెలంగాణా వరుసగా ఆరు, ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఉన్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో గత పదేళ్లలో సగటున 8,000 నుంచి 12,000 బ్యాంకింగ్‌ మోసాలు నమోదయ్యాయి.

ఇలా మోసం చేస్తారు

బ్యాంకు సిబ్బందిలా ఫోజులు కొడుతూ మీ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోండి, లేకపోతే మీ ఖాతా స్తంభించి పోతుందని ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎ్‌సలు లేదా ఇ-మెయిల్స్‌ పంపిస్తారు. ఇది నమ్మి వారు పంపిన లింక్‌ ఓపెన్‌ చేసి కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేస్తే, ఖాతాదారుల ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని క్షణాల్లో ఊడ్చేస్తారు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎ్‌సలు, ఇ-మెయిల్స్‌ నమ్మొద్దని ఆర్‌బీఐ, బ్యాంకులు ఎంత మొత్తుకుంటున్నా ఇంకా అమాయకులైన కొంత మంది ఖాతాదారులు వీరి వలలో పడి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 02:09 AM