YS Sharmila : హోదాపై ఏపీకీ, ఫ్యామిలీలో నాకూ జగన్ వెన్నుపోటు
ABN , Publish Date - Mar 08 , 2024 | 04:03 AM
ప్రత్యేక హోదా అంశంలో తల్లిలాంటి ఆంధ్రప్రదేశ్కూ, కుటుంబంలో తనకూ సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న జగన్... ఫోర్ ట్వంటీలేనన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక
రాష్ట్రాన్ని మోసగించిన బీజేపీకి మద్దతు
ఇస్తున్న జగన్ కూడా ఫోర్ ట్వంటీయే
హోదా లేక 15 లక్షల కోట్ల నష్టం
పది పరిశ్రమలు కూడా రాలేదు
హోదా సాధన ప్రతిజ్ఞ సభలో షర్మిల భావోద్వేగం
వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న పీసీసీ చీఫ్
హోదాపై ఏపీకీ, ఫ్యామిలీలో నాకూ
అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదా అంశంలో తల్లిలాంటి ఆంధ్రప్రదేశ్కూ, కుటుంబంలో తనకూ సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న జగన్... ఫోర్ ట్వంటీలేనన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ షర్మిల భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా చలించిపోయారు. షర్మిలను అనునయించారు. ఆగ్రహంతో ఊగిపోతూ ‘జగన్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ‘షర్మిల సింహం’ అంటూ బిగ్గరగా అరిచారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ, లోక్సభ ఆశావహులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక హోదా ప్రతిజ్ఞ సభలో ఈ దృశ్యాలు కనిపించాయి. ప్రత్యేక హోదా సాధన కోసం కట్టుబడి ఉంటామంటూ అందరితో షర్మిల ప్రతిజ్ఞ చేయించారు. విభజన పూర్తయి పదేళ్లయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి న్యాయం చేయలేకపోయాయన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా పూర్తి కాకపోవడంతో ఏపీకి రూ.12నుంచి 15 లక్షల కోట్ల మేర నష్టం జరిగిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తే ఎవరూ పోరాటం చేయడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోయేలా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు జగన్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మని వాపోయారు. రాష్ట్రంలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు గెలవకపోయినా, రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీయే పాలిస్తోందని షర్మిల అన్నారు. ఒక్క రాజధానికే దిక్కులేదుగానీ మూడు రాష్ట్రాలు కడతారట అంటూ జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చేశారని మండిపడ్డారు. హోదా రాలేదని.. పోలవరం పూర్తికాలేదని, రైల్వేజోన్ లేదంటూ గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. ఇన్నేళ్లలో విభజన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదన్నారు. బీజేపీ అంటే .. బాబు జగన్ పార్టీగా మారిపోయిందని షర్మిల వ్యాఖ్యానించారు. ‘‘ప్రత్యేక హోదాయే ఏపీకి ఊపిరి. ఉద్యమాలు జరగకపోతే హోదా రాదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాడుతుంది’’ అని షర్మిల ప్రకటించారు.