అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
ABN , Publish Date - May 20 , 2024 | 03:58 AM
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో సాగు కలిసిరాక, అప్పులు తీర్చలేక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
![అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ధర్మవరంరూరల్, మే 19: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో సాగు కలిసిరాక, అప్పులు తీర్చలేక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏలుకుంట్ల గ్రామానికి చెందిన గుట్టూరు బాలకృష్ణ(35) తనకున్న ఐదెకరాల్లో మామిడి సాగు చేశాడు. అంతరపంటగా వేరుశనగ పంట వేస్తుండేవాడు. రెండేళ్ల క్రితం తీవ్ర వర్షాభావంతో ఉన్న రెండు బోరుబావులు వట్టిపోయాయి. మరో రెండు బోర్లు వేయించినా కూడా అరకొరగా నీరు పడింది. ఆ నీరు పంటలకు చాలక మామిడి, వేరుశనగ పంటలు ఎండిపోయాయి. పంట పెట్టుబడుల కోసం బాలకృష్ణ రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. బోర్లు తవ్వించేందుకు భార్య పేరున మహిళా సంఘంలో రూ.50 వేలు, బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.40 వేలు అప్పు తీసుకున్నాడు. పంటలు చేతికి రాక అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెంది, శనివారం అర్ధరాత్రి ఇంటి సమీపంలోని షెడ్డులో ఉరేసుకుని మరణించాడు.