అంబేడ్కర్ స్మృతి వనంలో వైసీపీ కార్యక్రమాలు
ABN , Publish Date - Jan 21 , 2024 | 02:14 AM
అంబేడ్కర్ స్మృతి వనాన్ని వైసీపీ తన రాజకీయ కార్యక్రమాల వేదికగా మార్చివేయటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
![అంబేడ్కర్ స్మృతి వనంలో వైసీపీ కార్యక్రమాలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/bb_0cda88f1f9.jpg)
ఇప్పటికే పార్టీ కార్యక్రమంగా నిర్వహించిన ప్రారంభోత్సవం
ఐప్యాక్ జట్టు నేతృత్వంలో సీఎం జగన్ టీవీ షూటింగ్
రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకులు... అడ్డుకున్న పోలీసులు
సీపీఐ రామకృష్ణకూ నో చెప్పిన ఖాకీలు
మంత్రుల కాన్వాయ్లతో బందరు రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు
విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ స్మృతి వనాన్ని వైసీపీ తన రాజకీయ కార్యక్రమాల వేదికగా మార్చివేయటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రారంభోత్సవాన్ని సొంత పార్టీ కార్యక్రమంలా నిర్వహించి విమర్శలను ఎదుర్కొంటున్న వైసీసీ ప్రభుత్వం.. తాజా ఘటనతో మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఐప్యాక్ టీమ్ నేత ృత్వంలో ముఖ్యమంత్రి జగన్కు చెందిన ఓ టీవీ చానెల్ షో కోసం శనివారం అంబేడ్కర్ స్మృతి వనాన్ని ఉపయోగించుకున్నారు. ఆ షూటింగ్లో పాల్గొనడానికి మంత్రులు మేరుగు నాగార్జున, అదిమూలపు సురేశ్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల్, రాజన్నదొర వచ్చారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సందర్శలకులను లోపలికి అనుమతించకుండా గేట్లు వేశారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరిగిన మరుసటి రోజు నుంచే సందర్శకులను అనుమతిస్తామని జగన్ మీడియాలో ఇచ్చిన పెద్ద ప్రకటనలో పేర్కొన్నారు. అదిచూసి పెద్దఎత్తున తరలివచ్చిన సందర్శకులను పోలీసులు అడ్డుకున్నారు. దీనికితోడు ఆరుగురు మంత్రులకు చెందిన కాన్వాయ్ నిలుపుదల చేయటంతో.. బందరు రోడ్డు మీద వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణనూ అడ్డుకోవడంతో ఆయన అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు అనుమతి విషయంలోనూ వివాదం చోటు చేసుకుంది. ఆ తరువాత కొద్ది సేపటికి అనుమతించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ కార్యక్రమంగా నిర్వహించటాన్ని తప్పుబట్టారు.