దళితులపై వైసీపీ దౌర్జన్యం
ABN , Publish Date - Mar 08 , 2024 | 03:26 AM
రాష్ట్రంలో దళితులపై వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అనరుచులు దళితుల గుడిసెలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
రాప్తాడులో పేదల గుడిసెలకు నిప్పు
అడ్డొచ్చినవారిపై విచక్షణారహిత దాడి
స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపు
ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరుల బరితెగింపు
రాప్తాడు, మార్చి 7: రాష్ట్రంలో దళితులపై వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అనరుచులు దళితుల గుడిసెలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అడ్డొచ్చినవారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు జై భీమ్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. రాప్తాడు మండల పరిధిలోని ప్రసన్నాయపల్లిలో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రసన్నాయపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 123-2బీలోని రెండెకరాల స్థలంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దళితులు సుమారు వంద మంది మూడు రోజుల క్రితం గుడిసెలు వేసుకున్నారు. అప్పటి నుంచి ఆ స్థలం తమదేనని, ఖాళీ చేయాలని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని దళితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారు గుడిసెలు వేసుకున్న స్థలాలను వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్, జై భీమ్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి దస్తగిరి బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలీసులను అడ్డుపెట్టుకొని సీఎం జగన్ దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు భూకబ్జాలకు పాల్పడినా పట్టించుకోరు కానీ, దళితులు గుడిసెలు వేస్తే మాత్రం వారిని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. దస్తగిరి వెళ్లిపోయిన తర్వాత ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి అనుచరులు.. సుమారు 40 మంది కార్లు, ద్విచక్రవాహనాల్లో వచ్చి తమపై కట్టెలు, రాడ్లతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఆ తర్వాత తమ గుడిసెలపై పెట్రోలు చల్లి నిప్పంటించాని తెలిపారు. అడ్డొచ్చిన జై భీమ్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జి నరేశ్, కార్యకర్త విజయ్పై దాడి చేశారని, రెండు ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారని చెప్పారు.
పోలీసులు పట్టించుకోలేదు
వైసీపీ మూకల దాడిలో గాయపడ్డ నరేశ్, విజయ్ని చికిత్స నిమిత్తం అ నంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయ్ తీవ్రంగా గాయపడి, లేవలేని స్థితిలో ఉన్నారు. నరేష్ స్పల్పంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. రాప్తాడు ఎమ్మెల్యే అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ నాయకులు గుడిసెలకు నిప్పు పెడుతున్నప్పు డు బాధితులు రాప్తాడు పోలీ్సస్టేషన్కు వెళ్లారని, కానీ, డ్యూటీలో ఇటుకలపల్లి సీఐ నరేంద్రరెడ్డి పట్టించుకోలేదని వాపోయారు. ‘మిమ్మల్ని అక్కడ గు డిసెలు ఎవరు వేయమన్నారు...? మీ ఇష్టానుసారం గుడిసెలు వేస్తారా..? ఇక్కడి నుంచి వెళ్లిపోండి..’ అంటూ సీఐ అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు.