ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
ABN , Publish Date - May 03 , 2024 | 11:52 PM
టీడీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని టీడీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ అన్నారు.
![ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం](https://media.andhrajyothy.com/media/2024/20240428/3_ADN_22_474de155b5.gif)
టీడీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్
ఆస్పరి మండలంలో విస్త్రత ప్రచారం
ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్న గ్రామస్థులు
ఆస్పరి, మే 3: టీడీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని టీడీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ములుగుందం, బనవనూరు, కరుప్పల, పుట్టకలమర్రి, వలకొండ, అటేకల్, కైరుపల, డీ కోటకొండ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో టీడీపీ శ్రేణులతో కలిసి గ్రామస్థులు ఘనస్వాగతం పలికి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై ప్రజలకు వివరించారు. ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి, మరొక ఓటు ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. అనంతరం వీరభద్రగౌడ్ మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గం ఎడారిగా మారిందన్నారు. నియోజకవర్గానికి సాగునీటి ప్రాజెక్టులైన వేదావతి, నగరడోణ రిజర్వాయర్లును ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని జోహారాపురం గ్రామంలో ఎస్ఎస్ ట్యాంకు నిర్మించి, మండలంలో ప్రతి ఇంటికి తాగునీరు సమస్యలేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నాయకులు వెంకప్ప, వెంకట రాముడు, అమరేష్ గౌడు, కృష్ణయాదవ్, శేషాద్రి నాయుడు, శివన్న, నరసప్ప, రహంతుల్లా, శేశిరెడ్డి, సంజప్ప, సతీష్ కుమార్ పాల్గొన్నారు.
లింగంపల్లిలో 60 కుటుంబాలు టీడీపీలో చేరిక
హొళగుంద : మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన 60 వైసీపీ కుటుంబాలు వీరభధ్రగౌడ్ తమ్ముడు రాజాగౌడ్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. వైసీపీ నాయకులకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నాయకులు ఈరన్న, హనుంమంత రాయుడు, శేషగిరి, రామన్న పాల్గొన్నారు.