సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:45 PM
రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది సర్వసన్నద్ధం కావాలని, ఎలాంటి ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటుచేయాలని ఎస్పీ సిద్ధార్థ్కౌశల్ ఆదేశించారు.

పులివెందులటౌన్, మార్చి 6: రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది సర్వసన్నద్ధం కావాలని, ఎలాంటి ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటుచేయాలని ఎస్పీ సిద్ధార్థ్కౌశల్ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పోలీస్ అధికారులు, సిబ్బందికి రెండో దశ శిక్షణా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీ రానున్న ఎన్నికలకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక పోలింగ్కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. మద్యం, నగదుతో ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ట్రబుల్ మాంగర్లు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఏదైనా సంఘటన జరిగినపుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ వినోద్కుమార్, సీఐలు, ఎస్ఐలు, సెక్టార్ పోలీస్ ఆఫీసర్లు, స్పెషల్ బ్రాంచ్, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.