భవిష్యత్ కోసం ఓటేయాలి
ABN , Publish Date - Apr 08 , 2024 | 04:12 AM
ప్రస్తుత ఎన్నికల్లో మొదటి సారి ఓటు వేసే యువత ఆలోచించి ఓటేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ కోరారు.
తొలిసారి ఓటేసే యువతకు నీలాయపాలెం సూచన
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఎన్నికల్లో మొదటి సారి ఓటు వేసే యువత ఆలోచించి ఓటేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ కోరారు. ఎవరికి ఓటు వేస్తే.. యువత భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ బాగుపడుతుందో ఆలోచించాలని సూచించారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తల్లిదండ్రుల కలలను నిజం చేసేలా యువత ఉద్యోగాలు చేయాలి. జాబు రావాలంటే బాబు రావాల్సిందే. విభజన తర్వాత ఏపీలో టీడీపీ హయాంలో అభివృద్ధి ఎలా సాగిందో, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎలా నాశనమయ్యిందో చూశారు. చంద్రబాబు సంపద సృష్టించే పరిశ్రమలు తెచ్చారు. ఐదేళ్లలో 100కుపైగా ప్రముఖ పరిశ్రమలు వచ్చాయి. లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కానీ, జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు. ఉన్న పరిశ్రమలనూ తరిమికొట్టారు. 2019లో అధికారం చేపట్టిన జగన్.. విధ్వంసం, అరాచకం, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పరిశ్రమల్ని తన అవినీతి, అసమర్ధ విధానాలతో తరిమికొట్టారు. అమరావతిని ధ్వంసం చేశాడు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడు. ఈ నేపథ్యంలో మే 13న జరిగే ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు వేయాలి’ అని పేర్కొన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే యువతతోనే సాధ్యమన్నారు.