నేటి నుంచి బెజవాడలో తెలుగు రచయితల మహాసభలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:58 AM
విజయవాడలో శనివారం నుంచి ‘కలం’ సందడి చేయనుంది. ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను రెండ్రోజులపాటు నిర్వహించనున్నారు.

విజయవాడ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో శనివారం నుంచి ‘కలం’ సందడి చేయనుంది. ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను రెండ్రోజులపాటు నిర్వహించనున్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ వన్టౌన్లోని కేబీఎన్ కళాశాలలో శని, ఆదివారాల్లో ఈ మహాసభలు నిర్వహించనున్నారు. సభాప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములుగా ప్రాంగణంగా నామకరణం చేశారు. దుబాయి, అమెరికా, లండన్, యూఏఈ దేశాల నుంచి మొత్తం 1500 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. శనివారం ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరుకానున్నారు. విశిష్ట అతిథిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు. ఆరో ప్రపంచ తెలుగు కవుల మహాసభలను పురస్కరించుకుని రూపొందించిన ‘మార్పు’ పరిశోధనా గ్రంథాన్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ ఆవిష్కరిస్తారు. ఈసారి మహాసభల్లో కవి సమ్మేళనంతోపాటు యువగళ సమ్మేళనం నిర్వహించనున్నారు. 300 మంది విద్యార్థులు హాజరు కానుండగా వారికి ఇక్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.