ఉత్తమ పాస్పోర్టు కార్యాలయంగా ‘విజయవాడ’
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:56 AM
ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ఉత్తమ పాస్పోర్టు కార్యాలయ అవార్డును అందుకొంది.
2023-24లో రికార్డు స్థాయిలో 3,70,123 పాస్పోర్టులు జారీ
అంతకు ముందు ఏడాది కంటే 20 శాతం అధికం
ప్రాంతీయ కార్యాలయ విస్తరణ పనులు ప్రారంభం
కొత్త భవనంలోకి ‘పరిపాలన’.. ఇక ముద్రణ కూడా ఇక్కడే
రోజువారీ దరఖాస్తుల సంఖ్య రెట్టింపు చేస్తాం: శివ హర్ష
విజయవాడ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ఉత్తమ పాస్పోర్టు కార్యాలయ అవార్డును అందుకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ అవార్డును సాధించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సదస్సు నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్న ఈ సదస్సులో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అధికారి శివ హర్ష ఈ అవార్డును అందుకున్నారు. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం పరిధిలోకి విజయవాడ, తిరుపతి పాస్పోర్టు సేవా కేంద్రాలు(పీఎ్సకే)లతో పాటు 13 పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాలు(పీఓపీఎ్సకే)లు వస్తాయి. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,70,123 పాస్పోర్టు సంబంధిత సేవలను అందించారు. ఇంత భారీ సంఖ్యలో పాస్పోర్టులను జారీ చేసేందుకు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం జరిపిన కృషిని కేంద్ర విదేశాంగ శాఖ గుర్తించింది. ప్రజల నుంచి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ గంటలు పనిచేయటం, స్లాట్స్ సంఖ్య పెంచడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం, సులభతరమైన సేవలను అందించటం, పోస్టల్, పోలీసు శాఖలతో సమన్వయం పెంపొందించుకోవటం ద్వారా వేగంగా, అత్యుత్తమంగా విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం సేవలు అందించగలిగింది. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం కొత్త భవనంలోకి చేరింది. విజయవాడ పాత బస్టాండ్ సమీపంలో బందరురోడ్డులోని భారీ బహుళ అంతస్థుల భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పరిపాలనా కార్యాలయం కొత ్త భ వనంలో కొలువు తీరింది.
రోజువారీ దరఖాస్తుల సంఖ్య 1,200కు పెంచుతాం..
ఉత్తమ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. కార్యాలయ విస్తరణ పనులు చేపట్టాం. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో పాస్పోర్టులను జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం రోజుకు 600 మందికి అందిస్తున్న సేవలు అతి కొద్ది రోజుల్లోనే 1,200 వరకు పెంచనున్నాం. తత్కాల్లో రోజుల వ్యవధిలోనే పాస్పోర్టులు తీసుకునే అవకాశాన్ని కల్పించాం. ఆ మేరకు మెకానిజాన్ని అభివృద్ధి చేశాం. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు ప్రధాన కార్యాలయం కొత్త భవనంలో కొలువు తీరింది. అందులో పరిపాలనా వ్యవహరాలు మాత్రమే జరుగుతాయి. సేవా కేంద్రం ప్రస్తుతం ఉన్న చోటే యథావిధిగా పనిచేస్తుంది. పాస్పోర్టు ముద్రణ కూడా విజయవాడ పరిధిలోనే నిర్వహించబోతున్నాం. పాస్పోర్టు సేవాకేంద్రంలోనే ముద్రణ విభాగాన్ని ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నాం.
-శివహర్ష, విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అధికారి