Share News

‘గుర్తుతెలియని’ పిన్నెల్లి

ABN , Publish Date - May 23 , 2024 | 03:46 AM

ఎప్పుడో 13వ తేదీ పోలింగ్‌ రోజున జరిగిన ఈవీఎం ధ్వంసం ఘటన! 9 రోజుల తర్వాత, మంగళవారం వెలుగులోకి వచ్చింది!

‘గుర్తుతెలియని’ పిన్నెల్లి

బూత్‌లోకి జొరబడి ఈవీఎం బద్దలు

లేచి నిలబడి దండం పెట్టిన పీవో

ఎమ్మెల్యే పేరు లేకుండానే ఫిర్యాదు

‘గుర్తు తెలియని’ నిందితులపై కేసు

సిట్‌ విచారణతో కదిలిన డొంక

సీఈవో ఆఫీసు నుంచి సీసీ టీవీ ఫుటేజ్‌

ఆ తర్వాతే కేసులో ఏ1గా పిన్నెల్లి

వెబ్‌క్యాస్టింగ్‌ పెట్టి ప్రయోజనమేమిటి?

మాచర్లలో వైఫల్యాల పరంపర

(అమరావతి/నరసరావుపేట - ఆంధ్రజ్యోతి)

ఎప్పుడో 13వ తేదీ పోలింగ్‌ రోజున జరిగిన ఈవీఎం ధ్వంసం ఘటన! 9 రోజుల తర్వాత, మంగళవారం వెలుగులోకి వచ్చింది! స్వయంగా ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డే ఈవీఎంను బద్దలు కొట్టినా... అంతా గప్‌చుప్‌! జగన్‌ పాలనలో రాజ్యమేలిన భయానికి... యంత్రాంగం సలాం కొట్టిన తీరుకు ఇదే నిదర్శనం! పోలింగ్‌ రోజున మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌లోకి పిన్నెల్లి తన అనుచరులతో జొరబడ్డారు. నేరుగా ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌ దగ్గరికి వెళ్లి.. ఈవీఎంను బద్దలు కొట్టారు. వీవీప్యాట్‌ మెషిన్‌నూ విసిరికొట్టారు. దీనిపై సంబంధిత బూత్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అదే రోజున సెక్టోరల్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ... ఫిర్యాదులో పిన్నెల్లి పేరు ప్రస్తావించలేదు. ‘గుర్తు తెలియని వ్యక్తులు’ అని రాశారు. సెక్టోరల్‌ ఆఫీసర్‌ కూడా పోలీసులకు అదే విధంగా ఫిర్యాదు చేశారు. చివరికి... వీఆర్‌వో కూడా ‘గుర్తు తెలియని’ వాంగ్మూలమే ఇచ్చారు. పోలీసులూ ‘గుర్తు తెలియని వ్యక్తుల’పైనే కేసు నమోదు చేశారు. 15వ తేదీన ఇదే కేసులో మరికొన్ని సెక్షన్లు జత చేశారు. ఎమ్మెల్యే పేరు మాత్రం చేర్చలేదు. అసలు విషయం ఏమిటంటే... పిన్నెల్లి 20 ఏళ్లుగా మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బూత్‌లోకి రాగానే పోలింగ్‌ సిబ్బంది లేచి నిలబడి, దండాలు పెట్టారు. అయినా సరే... ‘గుర్తు తెలియని వ్యక్తులు’ అని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి...

పాల్వాయిగేటులో ఈవీఎం విధ్వంసం కేసు ‘గుర్తు తెలియకుండా’ గల్లంతయ్యేదే! కానీ పోలింగ్‌ జరిగిన మరుసటి రోజు మాచర్ల, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. మొత్తం ఘటనలపై ‘సిట్‌’ విచారణకు ఆదేశించింది. హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదు చేసిన సెక్షన్లు, నిందితులు, అరెస్టులపై ‘సిట్‌’ ఒక్కో కేసును నిశితంగా పరిశీలించింది. ఇదే క్రమంలో... పాల్వాయి గేటులో పోలింగ్‌ బూత్‌లో విధ్వంసం కేసులో ‘గుర్తు తెలియని వ్యక్తుల’ను చూసి ఆశ్చర్యపోయింది. ఇంకా ఎందుకు గుర్తుపట్టలేదని పోలీసులను ప్రశ్నించింది. దీంతో వారు నీళ్లు నమిలారు. సంబంధిత ఫుటేజ్‌ కోసం సీఈవోకు లేఖ రాశారు. ఈనెల 20న ఆ దృశ్యాలను సీఈవో కార్యాలయం అందించింది. అదే రోజున ఈ కేసులో పిన్నెల్లిని ఏ1గా చేర్చారు. ఈవీఎం విధ్వంసం దృశ్యాలు మంగళవారం బయటికి వచ్చాయి. మొత్తంగా తేలిందేమిటంటే... ఎమ్మెల్యేకు భయపడి ప్రిసైడింగ్‌ అధికారి, పోలింగ్‌ సిబ్బంది నోరు మెదపలేదు. సెక్టోరల్‌ ఆఫీసర్‌ కూడా అంతే. ‘సిట్‌’ రంగంలోకి దిగాకగానీ అసలు విషయం బయటపడలేదు. కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూంలో మాచర్ల నియోజకవర్గ ప్రత్యేక అధికారిగా ఉన్న డీపీవో విజయభాస్కరరెడ్డి ఈవీఎంల ధ్వంసాన్ని వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ఏమీ తెలియనట్టు మిన్నకున్నారు. ఈ అంశంపై కూడా సిట్‌ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

Updated Date - May 23 , 2024 | 03:46 AM