రాఘవేంద్రుడి సన్నిధిలో ఉడిపి పీఠాధిపతులు
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:52 AM
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక లోని ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతులు విద్యదీశ తీర్థులు, విద్య రాజేశ్వర తీర్థులు బుధవారం మంత్రాలయానికి వచ్చారు.
మంత్రాలయం, ఏప్రిల్ 17 : రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక లోని ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతులు విద్యదీశ తీర్థులు, విద్య రాజేశ్వర తీర్థులు బుధవారం మంత్రాలయానికి వచ్చారు. ఇరువురు పీఠాధిపతులకు పూర్ణకుంభంతో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, మఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు, శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్ ఆచార్, అప్రమేయ ఆచార్, విద్యపీఠం ప్రిన్సిపాల్ రమణరావు పాల్గొన్నారు.
మూలరాములకు మహాభిషేకం : శ్రీమఠంలోని మూలరాములు, జయరాములు, దిగ్విజయరాములకు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మహాభిషేకం చేశారు. పూర్ణబోధ పూజామందిరంలో విశాలమైన వెండి మండపంలో అలంకరించిన స్వర్ణ మండపంలో సంస్థాన పూజల్లో భాగంగా మూలరాములకు ప్రత్యేక మహాభిషేకం నిర్వహించారు.
వైభవంగా సీతారాముల కళ్యాణం : మంత్రాలయంలోని పాత ఊరిలో వెలసిన ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. బాజాభజంత్రీలతో దేవతామూర్తులను పల్లకీలో ఉంచి గ్రామ వీధుల గుండా ఊరేగించారు.