వైసీపీ నాయకుల దౌర్జన్యం
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:20 AM
బొందిమడుగుల గ్రామంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుడు దౌర్జన్యంగా ఓ స్థలాన్ని ఆక్రమించి యథ్ఛేచ్ఛగా చేపట్టిన ఇంటి నిర్మాణం వెలుగులోకి వచ్చింది.
ప్లాట్ కబ్జా చేసి యథేచ్ఛగా ఇంటి నిర్మాణం
పట్టించుకోని అధికారులు
తుగ్గలి, మార్చి 28: బొందిమడుగుల గ్రామంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుడు దౌర్జన్యంగా ఓ స్థలాన్ని ఆక్రమించి యథ్ఛేచ్ఛగా చేపట్టిన ఇంటి నిర్మాణం వెలుగులోకి వచ్చింది. గురువారం గ్రామానికి చెందిన బాధితురాలు సువర్ణ, ధనుంజయలు తమ గోడును వినిపించారు. తమ పూర్వీకుల నుంచి ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నామని, అధికారులు సర్వే.నెంబర్. 511లోని పట్టా.నెం. పీకేఎన్ఎల్. 01795161 పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, ఇదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఫీరా దౌర్జన్యంగా తమ స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ దౌర్జన్యంపై బుధవారం పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి, తహసీల్దార్ షర్మిళ, తుగ్గలి ఎస్ఐ మల్లికార్జునను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఇంత వరకు అక్రమ కట్టడం మాత్రం నిలిపివేయడం లేదని, దర్జాగా నిర్మాణ పనులు సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించి నిర్మాణ పనులు ఆపి గ్రామంలో విచారణ చేపట్టాలని కోరారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీరు పెట్టారు.