Share News

రఘురామ పిల్‌పై 23న విచారణార్హత నిర్ణయం

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:04 AM

అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం జగన్‌ తన వారికి అనుచిత లబ్ధి చేకూర్చేలా రూపొందించిన వివిధ పాలసీలు, తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు.

రఘురామ పిల్‌పై 23న విచారణార్హత నిర్ణయం

ఆ లోగా అనధికార ప్రతివాదులు కౌంటర్లు వేయాలని హైకోర్టు ఆదేశం

జగన్‌ ప్రభుత్వ విధానాలపై ఎంపీ పిల్‌

ఆప్తులకు అనుచిత లబ్ధిపై సీబీఐ విచారణకు సీఎం సహా బంధుగణంపై కేసులకు అభ్యర్థన

అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం జగన్‌ తన వారికి అనుచిత లబ్ధి చేకూర్చేలా రూపొందించిన వివిధ పాలసీలు, తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన కొన్నాళ్ల కిందట ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ విచారణార్హతను ఈ నెల 23న నిర్ణయిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు అందుకున్న అనధికార ప్రతివాదులను ఆదేశించింది. కౌంటర్ల ప్రతులను పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదికి అందజేయాలని సూచించింది. ఆయా కౌంటర్లకు రిప్లై దాఖలు చేయాలని సీనియర్‌ న్యాయవాదిని ఆదేశించింది. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఆ రోజు పిల్‌ విచారణార్హతపై వాదనలు విని నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు. దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. సీఎం జగన్‌ తన ఆప్తులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా వైసీపీ ప్రభుత్వం రూపొందించిన వివిధ పాలసీలు, తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి, బంధుగణంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. వ్యాజ్యం విచారణార్హతపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీంతో పిల్‌ విచారణార్హతను తేలుస్తామని ధర్మాసనం పేర్కొంది. పిల్‌ అనుమతికి ముందు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యం విచారణార్హతపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. మంగళవారం ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందు విచారణకు రాగా.. గతంలో తాము జారీ చేసిన నోటీసులు అందరికీ అందాయా?లేదా? అని ధర్మాసనం ఆరా తీసింది. ఎంపీ రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు బదులిస్తూ.. ప్రతివాదులలో కొందరికి ఈ-మెయిల్స్‌ ద్వారా నోటీసులు అందజేశామన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. పిల్‌ విచారణార్హతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్‌ దాఖలు చేశారని తెలిపారు.

Updated Date - Jan 03 , 2024 | 03:04 AM