Share News

నేడే ఎన్నికల నగారా

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:38 AM

సార్వత్రిక ఎన్నికల నగారా శనివారం మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది.

నేడే ఎన్నికల నగారా

మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్‌ ప్రకటన

లోక్‌సభతోపాటు ఆంధ్ర, ఒడిసా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీలకూ ఎన్నికలు

4-5 దశల్లో పార్లమెంట్‌ పోలింగ్‌?

ఏపీ, అరుణాచల్‌, సిక్కింలకు ఒకేసారి

ఒడిసాకు 4 విడతల్లో జరిగే అవకాశం

దేశవ్యాప్తంగా ఈసీ పర్యటనలు

షెడ్యూల్‌ ప్రకటించగానే కోడ్‌ అమల్లోకి

కొత్త కమిషనర్ల నియామకంపై స్టేకు సుప్రీం నో

న్యూఢిల్లీ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నగారా శనివారం మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్‌ విలేకరుల సమావేశం నిర్వహిం చనుంది. ఆ సందర్భంగా ఎన్నికల తేదీలను వెల్లడిస్తుంది. ఆంధ్ర, తెలంగాణల్లో ఏప్రిల్‌ నెలాఖరులో పోలింగ్‌ జరగొచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారికోసం 12లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4-5 దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగే అవకాశముంది. ఆంధ్ర, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయంటున్నారు. నక్సల్స్‌ ప్రభావం కారణంగా ఒడిసాలో నాలుగు దశల్లో జరిగే వీలుంది. ఈ దఫా లోక్‌సభ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమికి జీవన్మరణ సమస్యగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వేలు ఎన్డీయే హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని, బీజేపీ సొంతంగా 350 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేయడంతో అధికార కూటమి సమరోత్సాహంతో ఉంది. కాగా, బీజేపీ ఇప్పటికే 267 మంది అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌ కూడా 82 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. టీఎంసీ బెంగాల్‌, అసోంలలో పోటీచేసే 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆప్‌, ఎస్పీ కూడా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.

కమిషనర్ల నియామకాలపై స్టేకు నో

సీజేఐని సెలెక్ట్‌ ప్యానెల్‌ నుంచి తప్పించి అందులో ఒక కేంద్ర మంత్రిని నియమించేలా 2023లో చేసిన చట్టం ఆధారంగా జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూలను కొత్త ఎన్నికల కమిషనర్లుగా నియమించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సాధారణంగా మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఏ చట్టాన్నీ కోర్టు నిలిపివేయదని వ్యాఖ్యానించింది. కొత్త కమిషనర్ల నియామకచట్టాన్ని, జ్ఞానేశ్‌, సంధూల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. కొత్త కమిషనర్ల నియామకం కోసం సెలెక్ట్‌ కమిటీ సమావేశాన్ని ముందుకు జరిపారని పిటిషనర్లలో ఒకరైన జయాఠాకూర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ ప్రస్తావించారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Updated Date - Mar 16 , 2024 | 02:38 AM